అక్టోబరు 2న గ్రామ, వార్డు సచివాలయాల ప్రారంభానికి సన్నాహాలపై బుధవారం సీఎం జగన్మోహన్రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సచివాలయంతో గ్రామ సచివాలయాలను అనుసంధానం చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలపై స్థానికంగా స్పందించడానికి గ్రామ సచివాలయానికి ప్రత్యేకంగా ఒక నంబరు ఉండాలన్నారు. 72 గంటల్లో సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన విధంగా సచివాలయాల్లో ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. డేటా సెంటర్ కూడా ఉండాలని, సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించాలని, సంబంధిత శాఖాధిపతిని అప్రమత్తం చేసేలా వ్యవస్థ ఉండాలని సూచించారు. ఎమ్మార్వో, ఎంపీడీవో, కలెక్టర్, సంబంధిత శాఖల కార్యదర్శులు.. తదితరులందరితోనూ గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానం ఉండాలన్నారు. జాబ్చార్టు ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు కేటాయించిన విధులపై సమీక్షించారు. వలంటీర్ల వ్యవస్థపై మానిటరింగ్ చాలా ముఖ్యమన్నారు. రైతు భరోసాపై లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయిందా? అని సీఎం ఆరా తీశారు. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపికపై గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీలు జరగాలన్నారు. లబ్ధిదారుల జాబితాను గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉంచాలన్నారు. గ్రామ/వార్డు సచివాలయాల భవనాలు ఒకే నమూనాలో ఉండేలా చూడాలన్నారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఒక షాపు కూడా ఉండాలని, ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విధానాలపై సచివాలయాల్లో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా సుమారు 237 సర్వీసులు అందించాలని సీఎం ఆదేశించారు. అందులో 115 సర్వీసులు 72 గంటల్లోగా అందాలన్నారు.