అక్రమంగా దేశంలోకి చొరబడి రహస్యంగా ఆయుదాలు తరలిస్తున్న ముష్కరులను భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. జమ్మూ కశ్మీర్లోని కథువా జిల్లాలో ట్రక్కును తనిఖీ చేయగా ఇవి బయటపడ్డాయి. దీంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. వారి వద్ద నుంచి ఆరు ఏకే47 తుపాకులు, గ్రనెడ్ లాంఛర్లు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.
పంజాబ్లోని అమృత్సర్ నుంచి ఈ ట్రక్కు బయలుదేరినట్టుగా గుర్తించారు. దానిపై నిఘా ఉంచిన అధికారులు కుథువా ప్రాంతంలో సీజ్ చేశారు. జమ్మూ కశ్మీర్ నంబర్ ప్లేట్తో ఉన్న ఈ వాహనం ఎవరిది.. ఆయుధాలు ఎక్కడికి వెళ్తున్నాయనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేందుకు ఉగ్రవాదులు చొరబాట్లకు ప్రయత్నిస్తున్నారు. భద్రతా బలగాలు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశాయి. ఈ సమయంలోనే ఆయుధాలు పట్టుబడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.