తాను నివసించే ఇంటిపై డ్రోన్లు ఎగరడంపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ, డీజీపీ గౌతమ్ సవాంగ్తో ఫోన్లో మాట్లాడారు. హైసెక్యూరిటీ జోన్లో డ్రోన్లు ఎగరడంపై అధికారులను నిలదీశారు. డ్రోన్లు ఎగరేస్తున్న వ్యక్తులెవరు? వారికి అనుమతులు ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు. డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు లేకుండా డ్రోన్లు ఎగురవేయడానికి వీల్లేదు కదా? అని అన్నారు. అన్ని అనుమతులతోనే డ్రోన్లు ఎగరేస్తున్నారా అని ప్రశ్నించారు. నేను ఉండే నివాసంపై డ్రోన్లతో నిఘా పెట్టిందెవరు? చివరికి నా భద్రతనే ప్రశ్నార్థకంగా మారుస్తారా? డ్రోన్లు ఎగరేస్తూ పట్టుబడిన వ్యక్తులెవరు? ఆ డ్రోన్లలో ఏముందో, పట్టుబడింది ఎవరో తెలియజేయాలి. నిఘా వేసిందెవరో, దాని వెనక కుట్ర ఏముందో తెలియజేయాలి అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.