కాకినాడ రూరల్ : కాకినాడ అర్బన్ 3 వ డివిజన్ సురేష్ నగర్ లో (నిన్న) ఆదివారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువకుడిని హతమార్చిన ఘటన సోమవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. పైడి ముక్కల సురేష్ (19) అనే యువకుడిని ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. హత్య చేయబడ్డ యువకుడు స్నేహితులతో కలసి జులాయిగా తిరుగుతూ ఉండేవాడు. గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటుపడి గొడవలకు కారణమవుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో.. కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో 2 సంవత్సరాల క్రితం ఎటమ్ టు మర్డర్ కేసు కూడా యువకుని పై నమోదయ్యింది. ఇదివరకు జరిగిన గొడవల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానాన్ని వ్యక్తపరిచారు. పోస్ట్మార్టం నిమిత్తం మఅతదేహాన్ని కాకినాడ జిజిహెచ్ కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సర్పవరం సిఐ ఆర్.గోవింద రాజు తెలిపారు.