విజయవాడ, సూర్యబ్యూరో : రాష్ర్టంలో వ్యవసాయోత్పత్తుల అధిక దిగుబడి తోపాటు రైతుల ఆదాయం పెంపుదలకు ప్రభుత్వం కృతనిశ్చయంతో వుందని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తెలిపారు. సోమవారం సచివాలయంలో వ్యవసాయ శాఖాధికారులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాబోయే ఖరీఫ్ సీజన్ కోసం విత్తనాలు, ఎరువులు పంపిణీకి యాక్షన్ ప్లాన్ సిద్దం చేసినట్లు మంత్రి సోమిరెడ్డి తెలిపారు. ప్రస్తుత వేసవిని దృష్టిలో వుంచు కుని పండ్ల తోటల పెంపకంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింద న్నారు. ఇందుకోసం ప్రభుత్వం చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, కడప జిల్లాల్లో పండ్ల తోటలకు సాగునీరందించడానికి ప్రభుత్వం 80 శాతం సబ్సిడీపై రెయిన్గన్లు, సాగునీటి పరికరాలు అందించనుందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్ల నుంచి నివేదికలు కోరామన్నారు. ఇప్పటికే చిత్తూరు, అనంతపురం కలెక్టర్లు వివరాలు పంపించారన్నారు. కడప, నెల్లూరు జిల్లాల నుంచి వివరాలు రావాల్సి వుందన్నారు. సీఎం లక్ష్యం మేరకు వ్యవసాయ ఉత్పత్తులు పెరగడానికి, పెట్టు బడులు తగ్గే విధంగా చర్యలు చేపట్టామన్నారు. మిగిలిన జిల్లాల మాదిరిగా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో వరి ఉత్పత్తి పెంపుదలకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. నూతన వ్యవసాయ విధానాలు అమలు ద్వారా వ్వయసాయ ఉత్పత్తుల్లో దేశంలోనే ఏపీ అగ్రగామిగా వుండేలా కృషి చేస్తామన్నారు. మిర్చి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఢిల్లీలో వున్నారని, తాము కూడా వెళ్ళి, మిర్చి, రైతుల కష్టాలు కేంద్రం దృష్టికి తీసుకెళతామన్నారు. రెండు రోజుల్లో మిర్చి ధరపై ఒక ప్రకటన చేస్తామని మంత్రి తెలిపారు.