ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డీసీఎం.. ఇప్పుడెందుకు మాట్లాడరు..? పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఫైర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2024, 06:59 PM

ఏపీలో శాంతి భద్రతలు, మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి కూటమి సర్కారు వైఫల్యంపై వైసీపీ విమర్శలు కొనసాగిస్తోంది. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగిపోయాయని వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల ఆరోపించారు.కూటమి ప్రభుత్వం పాలన మహిళలకు చీకటి కాలమని మండిపడ్డారు. నేరస్థులకు ఇంతలా ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందన్న యాంకర్ శ్యామల.. ప్రభుత్వం చర్యలేవీ తీసుకోకపోవటం వల్లనే ఇలా పేట్రేగిపోతున్నారని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు కూటమి బలాన్ని మహిళల రక్షణ కోసం కాకుండా.. అధికారులపై ఒత్తిడి తేవడం కోసం వాడుకుంటున్నారని శ్యామల ఆరోపించారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసులో బాధితురాలు అందుకే పక్క రాష్ట్రానికి వెళ్లాల్సి వచ్చిందంటూ యాంకర్ శ్యామల ఆరోపించారు.


ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై కూడా యాంకర్ శ్యామల విమర్శలు గుప్పించారు. వారి నియోజకవర్గాల్లో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరిగితే కనీసం పరామర్శించాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. " పిఠాపురంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే అక్కడి ఎమ్మెల్యే, మన డీసీఎం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్లి పరామర్శించలేదు. దళిత వర్గానికి చెందిన బాలికనా? అంత చిన్నచూపా? వారికి అండగా ఉండాల్సిన బాధ్యత మీకు లేదా? 30 వేల మంది అమ్మాయిలు మాయమైపోయారంటూ అబద్ధపు ప్రచారాలు చేసి.. జగన్ గారి మీద నిరంతరం ఆరోపణలు చేసిన మీ నోటి వెంట.. ఒక్క మాట కూడా ఎందుకు ఇవాళ రావడం లేదు? హిందూపురంలో అత్తాకోడళ్లపై అఘాయిత్యం జరిగితే అక్కడి ఎమ్మెల్యేకు బాధ్యత లేదా.. ఒక్కసారైనా వెళ్లి పరామర్శించారా..?" అంటూ యాంకర్ శ్యామల ప్రశ్నించారు.


ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత.. మహిళలపై ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారని యాంకర్ శ్యామల ప్రశ్నించారు. సాటి మహిళగా మీకు పట్టదా అంటూ మండిపడ్డారు. మహిళలు, అమ్మాయిల భద్రత కోసం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన దిశ యాప్‌ని మళ్ళీ తీసుకురావాలని యాంకర్ శ్యామల డిమాండ్ చేశారు. రాజకీయ కక్షతో దిశ చట్టాన్ని పక్కన పెట్టారన్న యాంకర్ శ్యామల.. దిశ చట్టం వలన మహిళలకు ఆపద సమయంలో సహాయం అందుతుందన్నారు. ఇక టీడీపీ కూటమి సర్కారు పనితీరు మాటల్లో కాకుండా పేపర్లో ప్రకటనలలో మాత్రమే కనిపిస్తోందన్న యాంకర్ శ్యామల.. కూటమి అధికారంలోకి వచ్చాక తాగేందుకు నీరు లేక డయేరియాతో జనం చచ్చిపోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com