ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలోని ఆ ఆలయంలో ప్రసాదం బాధ్యతలు అక్షయపాత్రకు అప్పగింత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 07:21 PM

గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామికి సమర్పించే పానకం తయారీ బాధ్యతల్ని అక్షయపాత్రకు అప్పగించారు. మంత్రి నారా లోకేష్ సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరిలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని పానకాల స్వామి అని కూడా పిలుస్తుంటారు. భక్తులు స్వామివారికి పానకాన్ని నైవేద్యంగా సమర్పిస్తుంటారు. గతంలో ఆలయంలో ప్రైవేటు వ్యక్తులు బిందె పానకం రూ.50 నుంచి రూ.60కి భక్తులకు విక్రయించేవారు. ధర ఎక్కువగా ఉన్నా నాణ్యత లేని పానకం సరఫరా చేయడం, భక్తులు స్వామివారికి సమర్పించిన పానకం తిరిగి తీసుకువెళ్లేందుకు అవసరమైన ప్లాస్టిక్‌ సీసాల ధరలు కూడా ఇష్టానుసారంగా విక్రయించేవారనే విమర్శలు ఉన్నాయి.


శ్రీలక్ష్మీ నరసింహ స్వామి సమస్యలన్నీ మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లడంతో స్పందించారు.. ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు అనువుగా ఉండే విధంగా తక్కువ ధరకు బిందె పానకం అందజేసేందుకు వీలుగా.. మంత్రి నారా లోకేష్ సూచనతో.. ఈ పానకం బాధ్యతను అక్షయ పాత్రకు దేవాదాయశాఖ అప్పగించింది. ఒక బిందె పానకం రూ.30లకు విక్రయించే విధంగా నిర్ణయం తీసుకున్నారు అధికారులు. శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తులు స్వామివారికి పానకం సమర్పించే సమయాలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 3:30 గంటల వరకు ఉంటుంది. నేటి నుంచి భక్తులకు అక్షయపాత్ర ఆధ్వర్యంలో పానకం అందుబాటులోకి వస్తుందని తెలిపారు అధికారులు.


మంగళగిరిలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని పానకాల స్వామిగా కూడా భక్తులు పిలుస్తుంటారు. ప్రతి రోజూ స్వామి దర్శనానికి భక్తులు తరలి వస్తుంటారు. భక్తులు లక్ష్మీనరసింహ స్వామి దగ్గర కోరికలు చెప్పుకుంటారు.. ఆ తర్వాత భక్తులు కోరికల తీరితే పానకం తీసుకొచ్చి స్వామివారికి సమర్పిస్తారు. అందుకే స్వామివారిని పానకాల స్వామిగా పిలుస్తుంటారు. ఈ ఆయలంలో ఎంత పానకం పోస్తామో అందులో సగం వెనక్కు వస్తుందని భక్తుల నమ్మకం.. అందుకే భక్తులు పానకం సమర్పిస్తారు. అయితే ఆలయంలో భక్తులు స్వామికి సమర్పించే పనాకం తయారు చేసి విక్రయించేందుకు వేలం పాట నిర్వహిస్తారు ఆలయ అధికారులు. వేలంలో దక్కినవారికి ఏడాది పాటూ పానకం తయారు చేసి విక్రయించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ విధానాన్ని పక్కనపెట్టి అక్షయపాత్రకు అప్పగించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com