ఏపీలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ధర్నా ముగిసింది. రాష్ట్రంలోని పరిస్థితులపై జంతర్ మంతర్ వద్ద ఫోటో, వీడియో ఎగ్జిబిషన్ను కూడా ఏర్పాటు చేశారు. జగన్తో ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నాలో పాల్గొన్నారు. వైసీపీ ఆందోళనకు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మద్దతు తెలిపారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. అలాగే శివసేన (ఉద్ధవ్ థాకరే గ్రూప్) ఎంపీ సంజయ్ రౌత్ కూడా వైసీపీ ధర్నాకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఢిల్లీలో వైసీపీ ఆందోళనకు హాజరైన ప్రతి ఒక్కరికి జగన్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే హాజరుకాకపోయినా మద్దతు తెలిపిన వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. జంతర్ మంతర్లో జరుగుతున్న వైసీపీ ఆందోళనకు ఇక్కడికి వచ్చి మద్దతు తెలపడమే కాకుండా రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలను చూసి సంఘీభావం తెలిపిన పార్టీల నేతలకు కృతజ్ఞతలు అని చెప్పారు. ధర్నాలో భాగంగా ఏపీ సర్కార్పై జగన్ విరుచుకుపడ్డారు. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 30 వరకు హత్యలు జరిగాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న హేయమైన పనులపై జర్నలిస్టులు ఇకనైనా గళం విప్పాలని వైసీపీ అధినేత జగన్ పేర్కొన్నారు.