పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంతో దానిని పూర్తిచేసే బాధ్యత కేంద్రప్రభుత్వంపై ఉంటుంది. దీంతో ప్రాజెక్టుకు ఎంత మొత్తంలో నిధులు ఇస్తామనేది బడ్జెట్లో పేర్కొనకపోయినా.. ప్రాజెక్టుకు అయ్యే పూర్తి వ్యయాన్ని కేంద్రప్రభుత్వమే భరిస్తుందనే విషయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి బడ్జెట్లో స్పష్టం చేశారు. విశాఖపట్టణం-చెన్నై పారిశ్రామిక కారిడర్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని బడ్జెట్లో చెప్పారు. దేశ వ్యాప్తంగా పలు పారిశ్రామిక కారిడర్లను కేంద్రం అభివృద్ధి చేస్తోంది. పరిశ్రమల ఏర్పాటుతో దేశానికి సైతం పన్నుల రూపంలో ఆదాయం వచ్చే అవకాశం ఉండటంతో ఇండస్ట్రీయల్ కారిడర్ డెవలప్మెంట్కు కేంద్రం నిధులు ఇవ్వనుంది. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఏపీ విభజన చట్టంలో ఉండటంతో అదే విషయాన్ని కేంద్రమంత్రి చెప్పారు. ఇప్పటికే దేశంలో వెనుకబడిన రాష్ట్రాలు, జిల్లాల అభివృద్ధిపై కేంద్రప్రభుత్వం దృష్టిపెట్టింది. దీనిలో భాగంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాకు నిధులు ఇవ్వనుంది. కేంద్రప్రభుత్వం బడ్జెట్ పొందుపర్చిన విధంగా ఆంధ్రపదేశ్కు నిధులు సమకూరిస్తే తప్పకుండా రాష్ట్రప్రభుత్వంపై కొంత ఆర్థిక భారం తగ్గడంతో పాటు.. వేగంగా రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.