ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలపై సంచలన ట్వీట్ చేశారు. అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నికల్లో బ్యాలెట్నే వాడుతున్నాయని.. మన దగ్గర కూడా ఈవీఎంల బదులు బ్యాలెట్లు వాడాలని డిమాండ్ చేశారు. న్యాయం కేవలం జరిగినట్లు కనిపించడం కాదు.. నిజంగా జరగాలన్నారు. ప్రజాస్వామ్యం అనేది బలంగా ఉండటంతో పాటుగా నిస్సందేహంగా ప్రబలంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల పద్ధతుల్లో.. అభివృద్ధి చెందిన ప్రతీ ప్రజాస్వామ్య దేశాల్లో జరిగే ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారని చెప్పుకొచ్చారు. ఆ దేశాల్లో ఎక్కడా ఈవీఎంలను ఉపయోగించడం లేదని.. 'మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలి. ఈవీఎంల బదులు పోస్టల్ బ్యాలెట్లను ఉపయోగించాలి' అంటూ ట్వీట్ చేశారు. ఈవీఎంలపై చర్చ జరుగుతున్న వేళ.. మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది.
2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత.. దేశంలో ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్లపై మళ్లీ చర్చ మొదలైంది. టెస్లా యజమాని ఎలాన్ మస్క్ కూడా ఈవీఎంల అంశంపై స్పందించారు.. ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలంటే ఈవీఎంలపై నిషేధం అవసరమని అభిప్రాయపడ్డారు. ఆ వెంటనే కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మస్క్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యం కాదన్నారు. రాజీవ్కు ఎలన్ మస్క్ కౌంటర్ ఇచ్చారు.. 'ఎనీథింగ్ క్యాన్ బీ హ్యాక్డ్' అన్నారు. ఈ క్రమంలో ఈవీఎంల అంశంపై దేశవ్యాప్తంగా మరోసారి ఆసక్తికర చర్చ జరుగుతోంది.