గాంధీనగర్: భారతీయులకు సంబంధించిన వివరాలపై ఇతర దేశాల గుత్తాధిపత్యం అడ్డుకొనేలా చర్యలు తీసుకోవాలని ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. అలాగే రానున్న పది సంవత్సరాల్లో తమ సంస్థ గుజరాత్లో రూ.3లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. గాంధీనగర్లో తొమ్మదో వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్లో మాట్లాడుతూ.. గుజరాత్ ఎప్పటికీ తమ మొదటి ప్రాధ్యాన్యమన్నారు.రాజకీయ వలసవాదానికి వ్యతిరేకంగా జాతిపిత మహాత్మా గాంధీ చేపట్టిన ఉద్యమాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. ‘రాజకీయ వలసవాదాన్ని పారద్రోలడానికి గాంధీజీ జాతీయోద్యమానికి నాయకత్వం వహించారు. ఇప్పుడు మనందరం కలిసి డేటా వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ కొత్త ప్రపంచంలో డేటా అనేది కొత్త సంపద. భారత్కు చెందిన డేటాకు భారతీయులే నేతృత్వం వహించాలి.
విదేశాల గుత్తాధిపత్యాన్ని అడ్డుకోవాలి. భారత్లో సమాచార విప్లవాన్ని తీసుకురావడంలో విజయం సాధించడానికి మన సంపదపై నియంత్రణను మన ఆధీనంలోకే తెచ్చుకోవాలి’ అని వెల్లడించారు. ప్రధాని చేతల మనిషని, డిజిటల్ ఇండియా మిషన్ లక్ష్యాల్లో దీన్ని చేర్చుతారని ముకేశ్ విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే రానున్న పది సంవత్సరాల్లో గుజరాత్లో వివిధ రంగాల్లో రూ.3లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నామని ప్రకటించారు. ‘గుజరాత్ రిలయన్స్ జన్మభూమి. అలాగే కర్మభూమి. మా మొదటి ప్రాధ్యాన్యం ఎప్పటికీ గుజరాత్ రాష్ట్రమే’ అని స్పష్టం చేశారు. అలాగే పండిట్ దీన్ దయాళ్ విశ్వవిద్యాలయ నిర్మాణానికి రూ.150 కోట్లు కేటాయించనున్నామని తెలిపారు.