ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతి రాజధాని పనులు ప్రారంభం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 19, 2024, 07:12 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పూర్వ వైభవం దిశగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించారు.. ముందుగా తుళ్లూరు మండలం ఉద్దండరాయుని పాలెం దగ్గర సీఆర్డీఏ ఆఫీసు పనులను ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. సీఆర్డీఏ భవన ప్రాంగణంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ పూజా కార్యక్రమం నిర్వహించారు. 2014-2019 మధ్య రూ.160 కోట్లతో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏడంతస్తుల్లో సీఆర్‌డీఏ కార్యాలయ పనులు చేపట్టారు. 2017లో ప్రాజెక్టు కార్యాలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పనులను పక్కన పెట్టారు. ఇప్పుడు మొత్తం 3.62 ఎకరాల్లో జీ ప్లస్‌ 7 భవనాన్ని ఇక్కడ ప్రభుత్వం నిర్మిస్తోంది. అలాగే అదనంగా పార్కింగ్‌, ల్యాండ్‌ స్కేపింగ్‌కు 2.51 ఎకరాలు కేటాయించింది ప్రభుత్వం. ఆర్కిటెక్చరల్‌ ఫినిషింగ్స్‌, ఇంటీరియర్స్‌, ఎలక్ట్రిక్‌ పనులు పెండింగ్‌లో ఉన్నాయి.


అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉండే ప్రాంతం.. ఒక రాష్ట్రం, ఒక రాజధాని అని తాను ప్రతి చోటా చెప్పానన్నారు చంద్రబాబు. రాబోయే రోజుల్లో విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని.. కర్నూలులో హైకోర్టు బెంచ్‌, పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడ్డామని.. రాజధాని అమరావతి కోసం రైతుల్ని ఒప్పించి వేల ఎకరాల భూమిని సేకరించడం ఒక చరిత్ర అన్నారు. మళ్లీ అమరావతికి పూర్వ వైభవం కచ్చితంగా వస్తుందన్నారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైబరాబాద్‌ నగరాన్ని తీర్చిదిద్దిన ఘనత తెలుగు దేశం పార్టీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు చంద్రబాబు. ముందుచూపుతో ఆ రోజుల్లోనే సైబరాబాద్‌లో 8 వరుసల రోడ్లు వేశామని.. శంషాబాద్‌ విమానాశ్రయానికి 5 వేల ఎకరాలు ఎందుకని చాలామంది ప్రశ్నించారని.. అభివృద్ధికి అడ్డుపడే వారు ప్రతిచోటా ఉంటారన్నారు. గత ఐదేళ్లలో కూడా అమరావతికి అడ్డుంకులు సృష్టించారని.. రాజధాని ప్రాంత మహిళా రైతుల చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.


ఉమ్మడి రాష్ట్రంలో తాను సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో డబ్బులు ఖర్చు పెట్టలేదని.. సంపద సృష్టించానన్నారు ముఖ్యమంత్రి. 30 వేల కోట్లు రాష్ట్రానికి ఆదాయం వస్తుందని చెప్పానని.. సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్, ఉపాధికి ఒక కేంద్రంగా మారిందన్నారు. ఏపీ ప్రజలు అమరావతి పేరును నూటికి నూరు శాతం ఆమోదించారని.. రాజధానిని బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్టుతో సుందరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించామన్నారు. అమరావతికి టాప్ యూనివర్శిటీలు, 10 టాప్ బెస్ట్ స్కూల్స్, 10 టాప్ బెస్ట్ కంపెనీలు రావాలన్నారు. అమరావతి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లను కలుపుతూ బుల్లెట్ ట్రైన్‌లు తేవాలని చెప్పామన్నారు. అమరావతికి కేంద్రం చేస్తున్న సహకారానికి అభినందిస్తున్నామని.. ముఖ్యమైన టవర్లు, బిల్డింగ్ లు ప్రారంభిస్తామన్నారు. రాజధాని పనులు జెట్ స్పీడుతో జరగాలని చంద్రబాబు ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com