కాకినాడ:బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుఫాన్ తాకిడికి ఉద్యాన పంటలు అరటి, బొప్పాయి, పూల తోటలు, కోకో, కొబ్బరి తోటలు దెబ్బతిన్న వాటిలో ఉన్నాయి. అలాగే ఇటీవల ప్రారంభించిన ఇటుక బట్టీ కర్మాగారాలలో తయారుచేసిన పచ్చి ఇటుకలు నానడంతో యజమానులు, కూలీలు నష్టపోయారు. తుఫాన్ తాకిడితో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో తీవ్ర విద్యుత్ అంతరాయాలు ఏర్పడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
16న రాత్రి నుంచి విద్యుత్ లేని కారణంగా త్రాగునీరు కొరకు ప్రజలు అల్లాడుతున్నారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై ప్రత్యేక ఏర్పాట్లు చేయనారంభించారు. మండల ప్రత్యేక అధికారి రాజమహేంద్రవరం డిప్యూటీ రిజిస్ట్రార్ నాగభూషణం పర్యవేక్షణలో గ్రామాల్లో నీటి సరఫరా ట్యాంకుల వద్ద పవర్ జనరేటర్లను ఏర్పాటు చేసి ట్యాంకులు నింపి త్రాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు మండల పరిధి 18 గ్రామాలలో ఆయన ఈఓపిఆర్డి పి.బొజ్జురాజు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఎం.పోసమ్మ లతో కలసి సుడిగాలి పర్యటన చేస్తూ కార్యాచరణ రూపొందించారు. ఆయా గ్రామ సెక్రటరీలకు వివిధ సలహాలు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదరస్సులు సత్యనారాయణ, మోక్షఅంజలి, నరసింహం, సత్తిబాబు, బోసు, రాజు తదితరులు పాల్గొన్నారు.