ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింహాచలం స్టేషన్‌కు మహర్దశ.. మారిపోనున్న రూపురేఖలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 09, 2023, 06:49 PM

సింహాచలం రైల్వేస్టేషన్‌‌ను రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో భాగంగా 20 కోట్ల రూపాయల వ్యయంతో సింహాచలం స్టేషన్ అభివృద్ధి పనులను కేంద్రం చేపట్టింది. రోడ్డు విస్తరణ, వాహన పార్కింగ్, కమర్షియల్ కాంప్లెక్స్, నూతన ప్లాట్‌ఫామ్ నిర్మాణాలను చేపట్టనున్నారు.ఈ పనులను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అశ్విని వైష్ణవ్.. విజయనగరం జిల్లా కంటకాపల్లి రైల్వే ప్రమాద ఘటన మానవ తప్పిదమని తెలిపారు. మానవ తప్పిదం కారణంగానే రైలు ప్రమాదం జరిగిందన్న రైల్వే మంత్రి.. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.


ఇదే సమయంలో రైల్వే ప్రయాణికులకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ శుభవార్త చెప్పారు. దేశంలో వందేభారత్ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తోందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే మరిన్ని వందేభారత్ రైళ్లు పట్టాలెక్కనున్నట్లు తెలిపారు. వారానికి ఒక వందేభారత్ రైలు నిర్మాణం జరుగుతోందని వివరించారు. రైల్వేలను రాజకీయాలను ముడిపెట్టి చూడొద్దని రాజకీయపార్టీలకు సూచించారు. ఈ సందర్భంగానే ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేల అభివృద్ధి కోసం 8వేల406కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పనుల కోసం అవసరమైన భూమిని కేటాయించేలా ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. ఇక దేశవ్యాప్తంగా వచ్చే దీపావళి నాటికి బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. కొత్తగా నాలుగువేల సెల్‌ఫోన్ టవర్లు ఏర్పాటు చేస్తున్నామన్న రైల్వేమంత్రి.. అందులో ఎక్కువ భాగం ఉత్తరాంధ్రలోనే ఉన్నట్లు వివరించారు.


మరోవైపు విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద అక్టోబర్ నెలలో జరిగిన రైలు ప్రమాదంలో 14 మంది మరణించారు. వందమందికి పైగా గాయపడ్డారు. విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్‌ రైలు కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్‌ కోసం పట్టాలపై ఆగి ఉంది. అదే సమయంలో వెనుకే వస్తున్న విశాఖ-రాయగడ రైలు.. ప్యాసింజర్‌ రైలును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. రైళ్లు ఢీకొనడంతో ఘటనా స్థలంలో విద్యుత్‌ వైర్లు తెగిపోయాయి. ఘటనలో 14 మంది చనిపోగా.. వందమందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే శనివారం సింహాచలం పర్యటనలో కేంద్రమంత్రి దీనిపై వివరణ ఇచ్చారు. ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com