విజయవాడ: బీజేపీ సీనియర్ నాయకురాలు పురందేశ్వరిపై టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం మీడియాతో మాట్లాడిన యామిని.. కాంగ్రెస్-టీడీపీ పొత్తులపై పురందేశ్వరి వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. అసలు పురందేశ్వరి ఏ పార్టీ నుంచి వచ్చి ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు.
ఏపీ అభివృద్ధికి ఖర్చు చేసిన నిధులపై బీజేపీ ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యలు దుర్మార్గమన్నారు. పటేల్ విగ్రహం కోసం కేంద్రం రూ. 3వేల కోట్లు ఖర్చు చేస్తే కనబడలేదా? అని ఈ సందర్భంగా ఆమె సూటి ప్రశ్న సంధించారు. కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకువచ్చారో బీజేపీ నేతలు చెప్పాలని యామిని సాధినేని డిమాండ్ చేశారు. రాఫెల్ కుంభకోణంపై బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు.