ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్, కెనడాల మధ్య దౌత్య యుద్ధం,,,ఆచితూచి అడుగులు వేస్తోన్న అమెరికా

international |  Suryaa Desk  | Published : Sun, Sep 24, 2023, 10:13 PM

భారత్, కెనడాల మధ్య తలెత్తిన దౌత్యపరమైన వివాదం నుంచి అమెరికా వీలైనంత దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుందా? భారత్‌తో మెరుగుపడుతోన్న సంబంధాలకు విఘాతం కలగకూడదని భావిస్తుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. భారత్, కెనడాల మధ్య కొనసాగుతున్న దౌత్య యుద్ధానికి దూరంగా ఉండాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుందని ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజీ సంస్థ సిగ్నమ్ గ్లోబల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు చార్లెస్ మైయర్స్ వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం హయాంలో భారత్‌తో సంబంధాల్లో సాధించిన పురోగతికి అంతరాయం కలిగించకూడదని బైడెన్ యంత్రాంగం భావిస్తోందని ఆయన అన్నారు.


‘చైనాను నిలువరించేందుకు భారత్‌తో కలిసి చేయగలిగినదంతా చేస్తున్నాం.. ఈ వివాదంలో అమెరికా జోక్యం చేసుకుంటుందని నేను అనుకోను అని సిగ్నమ్ చైర్మన్ చార్లెస్ మైయర్స్ అభిప్రాయపడ్డారు. ఖలీస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జార్ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్రపై తమకు విశ్వసనీయ సమాచారం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య అగ్గిరాజేసింది. కెనడా గడ్డపై తమ పౌరుడి హత్యలో ఏదైనా విదేశీ ప్రభుత్వం పాత్ర దేశ సార్వభౌమాధికారంపైనే దాడిగానే పరిగణిస్తామని ట్రూడో పార్లమెంట్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.


కెనడా ప్రధాని ఆరోపణలపై అమెరికా ఆచితూచి అడుగులేస్తోంది. నిజ్జర్ హత్య కేసు విచారణలో కెనడాతో కలిసి భారత్ పనిచేయాలని సూచించిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకేన్.. మేము జవాబుదారీతనాన్ని కోరుకుంటున్నామని అన్నారు. దర్యాప్తు చేపట్టి ఫలితం రాబట్టడం ముఖ్యమని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా, అమెరికా, ఇతర మిత్రదేశాలు భారతీయ దౌత్యవేత్తలను బహిష్కరించడం వంటి నిర్దిష్ట ప్రతీకార చర్యలకు మాత్రం దూరంగానే ఉన్నాయి.


ట్రూడో ఆరోపణలతను ఖండించిన భారత్.. కెనడా గడ్డపై తమ దేశానికి వ్యతిరేకంగా జరుగుతోన్న కుట్రలను అడ్డుకోవడంలో అక్కడి ప్రభుత్వం విఫలమైందని మండిపడింది. భారత సీనియర్ దౌత్యవేత్తను కెనడా బహిష్కరించడంతో ఇండియా కూడా దీటుగానే బదులిచ్చింది. న్యూఢిల్లీలోని కెనడా రాయబారికి సమన్లు జారీచేసిన మోదీ ప్రభుత్వం.. ఐదు రోజుల్లోగా తమ దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అలాగే, కెనడా పౌరులకు వీసాలను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది.  కెనడా ప్రధాని ట్రూడో బహిరంగంగా తీవ్రమైన ఆరోపణలు చేశారంటే ఆయన వద్ద నిఘా సమాచారం, సాక్ష్యాలు ఉండాలి.. ఒకవేళ నిజమైతే.. ఇది కెనడా గడ్డపై ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందనడానికి సరైన ఉదాహరణ.. అయినప్పటికీ, అమెరికా దీని నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది’ అని మైయర్స్ అన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com