ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ నుంచి 6.40 గంటల్లో చెన్నైకి,,,ఇరు నగరాల మధ్య వందేభారత్ రైలు సేవలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 24, 2023, 06:15 PM

విజయవాడ-చెన్నై నగరాల మధ్య వందేభారత్ రైలును ప్రధాని మోదీ నేడు (ఆదివారం) వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. 8 బోగీల ఈ రైలు వారంలో ఆరు రోజులు ఇరు నగరాల మధ్య పరుగులు తీయనుంది. ఒక్క మంగళవారం మాత్రం ఈ రైలు సేవలు అందుబాటులో ఉండవు. ఆదివారం లాంఛనంగా వందేభారత్ రైలును ప్రారంభించినప్పటికీ.. సోమవారం (సెప్టెంబర్ 25) నుంచి ఈ రైలు సేవలు సామాన్యులకు అందుబాటులో ఉంటాయి.


వందేభారత్ రైల్లో విజయవాడ నుంచి చెన్నైకి 6 గంటల 40 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. విజయవాడలో మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభయ్యే ఈ రైలు రాత్రి 10 గంటలకు చెన్నై చేరుకుంటుంది. తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంటల్లో స్టాప్‌లు ఉన్నాయి. 3.49 గంటలకు తెనాలి చేరుకునే ఈ రైలు.. సాయంత్రం 5.03 గంటలకు ఒంగోలు వెళ్తుంది. సాయంత్రం 6.19కి నెల్లూరు, రాత్రి 8.05 గంటలకు రేణిగుంట చేరుకుంటుంది.


చెన్నైలో ఉదయం 5.30 గంటలకు బయల్దేరే ఈ రైలు మధ్యాహ్నం 12.10 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఉదయం 7.05 గంటలకే చెన్నై నుంచి రేణిగుంట చేరుకుంటుంది. 8.39 గంటలకు నెల్లూరు, 10.09 గంటలకు ఒంగోలు, 11.21 గంటలకు తెనాలి చేరుకుంటుంది. విజయవాడ నుంచి చెన్నైకి చైర్ కార్ ధర రూ.1420 కాగా.. ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ.2690గా ఉంది. తిరుగు ప్రయాణంలో టికెట్ల ధరలు కాస్త తక్కువగా ఉన్నాయి. చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడకు ఏసీ చైర్ కార్ ధర రూ.1320 కాగా.. ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ.2540గా ఉంది. క్యాటరింగ్ ఛార్జీలు లేకుండానైతే టికెట్ల ధరలు ఇంకా తగ్గుతాయి. విజయవాడ నుంచి రేణిగుంట వరకు చైర్ కార్ టికెట్ ధర రూ.1175 ఉండగా.. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ.2110గా ఉంది. తిరుగు ప్రయాణంలో ఈ ధరలు రూ.1075, రూ.2020గా ఉన్నాయి.


ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య విజయవాడ మీదుగా వందేభారత్ రైలు నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చెన్నై రూట్లో మరో రైలు రావడంతో.. విజయవాడవాసులకు రెండో వందే భారత్ సేవలు అందుబాటులోకి వచ్చినట్టు అవుతుంది. వాస్తవానికి విజయవాడ-చెన్నై మధ్య వందేభారత్ రైలును రెండు నెలల క్రితమే ప్రారంభించాల్సి ఉంది. కానీ టెక్నికల్ సమస్యల కారణంగా చివరి నిమిషంలో రద్దు చేశారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడుస్తోన్న వందేభారత్ రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు మీదుగా తిరుపతి చేరుకుంటోంది. ఇప్పుడు కొత్త వందేభారత్ రైలుతో ఒంగోలు, నెల్లూరు వాసులకు సైతం రెండు వందేభారత్ రైళ్ల సేవలు అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com