విజయవాడ : వైసీపీ అధినేత వైఎస్ జగన్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీడీపీ ఎంపీ మురళీమోహన్ హెచ్చరించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 18 నెలలు జైలులో గడిపిన జగన్కు, తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. గతంలో వైఎస్ కూడా తనపై అసత్య ఆరోపణలు చేసి నిరూపించలేకపోయారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలీఫ్ అనే ఒక సంస్థ సేవా కార్యక్రమాలు చేస్తోందని, ప్రభుత్వం దానికి భూమి కేటాయిస్తే తనకేం సంబంధమని మురళీమోహన్ చెప్పారు. వైఎస్ జగన్ తనపై చేసిన ఆరోపణలను 24 గంటల్లోగా నిరూపించాలని టీడీపీ ఎంపీ మురళీమోహన్ కోడలు రూప డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తనకు ప్రభుత్వ భూమి ఉన్నట్టు నిరూపిస్తే, తనపై ఏ కేసులకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఇతరులపై ఆరోపణలు చేసే ముందు ఆలోచించుకోవాలని, ఆధారాలుంటేనే ఆరోపణలు చేయాలని జగన్ కు హితవు పలికారు.
రాజమండ్రి బలభద్రపురంలో తనకు ప్రభుత్వ స్థలం ఇస్తానన్నా వద్దన్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు. అంతకుముందు, మురళీమోహన్ మాట్లాడుతూ, జగన్ తన తీరు మార్చుకోకపోతే చట్టపరంగా స్పందిస్తానని హెచ్చరించారు. ఇసుక దందాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, దొంగబుద్ధులు తమకు లేవని, రాజమండ్రిలో తాను కట్టుకున్న ఇంటికి ఇసుకను మార్కెట్ రేట్ ప్రకారమే కొనుగోలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ కు తనపై ఆరోపణలు చేసే అర్హత లేదని అన్నారు. అలిఫ్ సంస్థకు భూ కేటాయింపుల వ్యవహారంలో తన కోడలు రూపకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు.