రాజకీయ అవగాహనలేని నాయకులు రోడ్లపై తిరుగుతున్నారని, సినిమా హీరో ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నిస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై టీడీపీ ఎమ్మెల్సీ వర్ల రామయ్య పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సినిమా హీరోలను ప్రజలు ఆదరించే పరిస్థితి ఇప్పుడు లేదని అన్నారు. వైసీపీ అధినేత జగన్, పవన్ కల్యాణ్ లు తెరవెనుక వ్యవహారాలతో రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్నారని, ఎంపీలు, ఎమ్మెల్యేలను డమ్మీలను చేసిన ఘనత జగన్ కే దక్కుతుందని విమర్శించారు. బీజేపీ, ప్రధాని మోదీలపై ప్రతిపక్ష నాయకులు ఎందుకు విమర్శలు చేయడం లేదు? మోదీ పాలన నచ్చి విమర్శించడం లేదా? అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులెవ్వరూ ప్రతిపక్ష నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయొద్దని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.