శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే లాల్ సింగ్ జర్నలిస్టులకు హెచ్చరికలు జారీ చేశారు. జర్నలిస్ట్ షుజాత్ బుఖారీని ఉగ్రవాదులు చంపిన విషయాన్ని గుర్తుంచుకోవాలని, ప్రతి జర్నలిస్ట్ తనకు తానుగా ఓ గీత గీసుకోవాలని ఆయన అన్నారు. గతంలో ఉన్న పీడీపీ, బీజేపీ ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు బీజేపీ మంత్రుల్లో లాల్ సింగ్ ఒకరు. కథువా రేప్ ఘటనలో రేపిస్టులకు మద్దతుగా ర్యాలీ తీసిన వివాదంలో ఈయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచే తాను రేపిస్టుల తరఫున ఉన్నానని జమ్ముకశ్మీర్ మీడియా తప్పుడు ప్రచారం చేసిందంటూ లాల్ సింగ్ చెప్పడం ప్రారంభించారు. ఆ కేసు మొత్తంలో ఓ తప్పుడు ప్రచారాన్ని కశ్మీరీ జర్నలిస్టులు సృష్టించారు. ఇప్పటికైనా కశ్మీర్ జర్నలిస్ట్లు ఓ గీత గీసుకోవాలి. ఎలా బతకాలో తెలుసుకోవాలి. షుజాత్కు జరిగిన పట్టిన గతే మీకు పట్టే వరకు వేచి చూడాలనుకుంటున్నారా? సోదరభావం పెంపొందేలా, అభివృద్ధి ముందుకు సాగేలా ఇక నుంచైనా జర్నలిస్టులు వ్యవహరించాలి అని లాల్ సింగ్ అన్నారు. ఈ నెల 14న రైజింగ్ కశ్మీర్ ఎడిటర్ అయిన షుజాత్ బుఖారీని ఉగ్రవాదులు హత్య చేసిన విషయం తెలిసిందే. షుజాత్ బుఖారీ సోదరుడు సయ్యద్ బషరత్ అహ్మద్ బుఖారీ పీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు.