ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్ర‌తీ సంవ‌త్స‌రం డీఎస్సీ భ‌ర్తీ చేస్తాం...నారా లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 27, 2023, 11:48 PM

టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులను భర్తీచేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువతకు హామీ ఇస్తున్నా.. త్వరలోనే యువతకు ప్రత్యేకంగా మేనిఫెస్టో తీసుకు రాబోతున్నాం లోకేష్ ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని? ప్రైవేటు రంగం నుంచి ఎన్ని? స్వయం ఉపాధి ద్వారా ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామో స్పష్టంగా ప్రకటిస్తామని చెప్పారు. ఏటా డీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తామని.. ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. కౌలు రైతులకు ప్రత్యేక కార్యాచరణ తీసుకొచ్చి ఆదుకుంటామని నారా లోకేష్ ప్రకటించారు.


'యువగళం పేరు ప్రకటించగానే నేతలకు వణుకు పుట్టింది. 10 మంది మంత్రులు నాపై మాటల దాడికి దిగారు. ఏ అర్హతతో పాదయాత్ర చేస్తున్నావని ప్రశ్నించారు. గతంలో మంత్రిగా దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా అభివృద్ధి చేశాను. ఐటీ మంత్రిగా.. వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాను. ఆ అర్హతతోనే పాదయాత్ర చేస్తున్నా. నన్ను విమర్శించే మంత్రులను ప్రశ్నిస్తున్నా.. ఈ మూడేళ్లలో మీరు ఈ రాష్ట్రానికి ఏం చేశారు' అని నారా లోకేష్ నిలదీశారు.


'ఆంధ్రుల సత్తా ఏంటో చంద్రబాబు చూపించారు. కానీ, ఒక్క ఛాన్స్‌ ఇస్తే జగన్‌ రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఈ మూడేళ్లలో వైఎస్సార్సీపీ చేసిందేమిటి? మైసూర్‌ బోండాలో మైసూర్‌ ఉండదు.. జాదూరెడ్డి జాబ్‌ క్యాలెండర్‌లో ఉద్యోగాలు ఉండవు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఇస్తామన్నారు.. ఏమయ్యాయి ఉద్యోగాలన్నీ? ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామన్నారు ఏమైంది? మెగా డీఎస్సీ ఏమైంది' అని లోకేష్ ప్రశ్నించారు.


'మంత్రి పదవిలో ఉన్న వాళ్లు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. జీవో1తో అడ్డుకోవాలని చూస్తారా? పవన్‌ కల్యాణ్‌ పోరాటాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. పవన్‌ వారాహి వాహనానికి ఆంక్షలు పెడుతున్నారు. యువగళం ఆగదు, వారాహి ఆగదు. భయం నా బయోడేటాలోనే లేదు. అడ్డొస్తే తొక్కుకుని వెళ్లి పోతాం. మంచి కోసం పోరాడే ధైర్యం ఉంది. సైకిల్‌ పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి. 400 రోజుల పాదయాత్రలో ఇది తొలిరోజు. నిరుద్యోగ యువతకు పిలుపినిస్తున్నా.. కలిసికట్టుగా ఉద్యమించి జగన్‌ను ఇంటికి పంపిద్దాం' అని లోకేష్ వ్యాఖ్యానించారు.


'ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. దానికి కారణం మీపైన ఉన్న కేసులే. యువత, రైతులు.. ఇలా అన్ని వర్గాలు ఈ ప్రభుత్వం బాధితులే. ఈ మూడేళ్లలో రాష్ట్రాన్ని 67 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. 3 రాజధానుల్లో ఎక్కడైనా ఒక్క ఇటుకైనా వేశారా. పారిశ్రామిక వేత్తలు పక్క రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి వచ్చింది. జే ట్యాక్స్‌ కట్టలేదని పక్క రాష్ట్రానికి పంపించేశారు. మహిళలపై దాడులు జరిగితే గన్‌ కంటే ముందు జగన్‌ వస్తాడని ప్రగల్భాలు పలికారు. కానీ, అది బుల్లెట్లు లేని గన్‌ అని ప్రజలకు అర్థమైంది' అని లోకేష్ విమర్శలు గుప్పించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com