కొలంబో: బంగ్లాదేశ్ క్రికెటర్లు హద్దులు దాటారు. అంతర్జాతీయ క్రికెట్లో పసికూన ముద్రను చెరిపేసుకుంటూ వెళ్తున్న బంగ్లా.. క్రీడాస్ఫూర్తికి విరుద్దంగా వ్యవహరిస్తూ నవ్వులపాలవుతోంది. గల్లీలో ఆడే ఆటగాళ్ల మాదిరే అంతర్జాతీయ మ్యాచ్ల్లోనూ క్రమశిక్షణ లేకుండా చిన్న పిల్లలా ప్రవర్తిస్తూ తమ అసహనాన్ని ప్రదర్శిస్తోంది. తాజాగా ముక్కోణపు టీ20 టోర్నీలో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్ డోర్ను పగలగొట్టడం పెద్ద వివాదాస్పదమైంది.
రసవత్తరంగా సాగిన టీ20 పోరులో చివరికి బంగ్లానే విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో అనూహ్య సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇరు జట్ల ఆటగాళ్లు వాగ్వాదాలకు దిగారు. అంపైర్లు, మ్యాచ్ రిఫరీ కలగజేసుకొని మ్యాచ్ను కొనసాగించారు. ఎట్టకేలకూ 2 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ గెలుపొందింది. ఈ ఆనందంలో ప్రేమదాస స్టేడియంలోని బంగ్లాదేశ్కు కేటాయించిన డ్రెస్సింగ్ రూమ్లోని గ్లాస్ డోర్ను ఓ ఆటగాడు ఆవేశంతో పగలగొట్టాడు. సీసీటీవీ పుటేజిని పరిశీలించి ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించాలని గ్రౌండ్ సిబ్బంది కోరారు. దీనిపై మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ ఆరా తీసినట్లు సమాచారం. జరిగిన నష్టానికి పరిహారం చెల్లిస్తామని బంగ్లాదేశ్ టీమ్ మేనేజ్మెంట్ ముందుకొచ్చినట్లు తెలిసింది. ఐసీసీ క్రీడా నిబంధనల ప్రకారం మైదానంలోని వస్తువులను కూడా నాశనం చేస్తే కఠిన చర్యలుంటాయి. ఐతే ఈ ఘటనపై మ్యాచ్ రిఫరీ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఫైనల్లో టీమిండియాతో బంగ్లా తలపడనుంది.