అమరావతి : విభజన చట్టంలోని హామీల గురించే మేం అడుగుతున్నామని తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రం కోలుకోవాలనే ఉద్దేశంతోనే నాడు విభజన చట్టం లో కొన్ని హామీలు ఇచ్చారన్నారు. మేం దాని గురించి పోరాడుతుంటే బీజేపీ నేతలు ప్రధాని గృహ నిర్మాణం, జాతీయ రహదారులకు నిధులు కేటాయించామని చెబుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ భారత దేశంలో భాగమేననీ, దేశంలోని మిగిలిన రాష్ట్రాలన్నిటికీ కేటాయించిన విధంగానే మనకూ కేటాయించారని ఆయన వివరించారు. విభజన చట్టంలోని హామీల అమలు విషయం నాలుగేళ్లు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందన్నారు. ప్రత్యేక హోదాతో సమానమైన ప్రయోజనాలన్నీ వచ్చే విధంగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు. ఇప్పటి వరకూ ఏమిచ్చారో చెప్పగలరా? అని కేంద్రాన్ని రామ్మోహననాయుడు ప్రశ్నించారు. పోలవరం గురించి ఇప్పటికీ క్లారిటీ లేదన్నారు. చెప్పిందే చెప్పడానికి 27 పేజీల నోట్ ను వివరిస్తూ ప్రెస్ మీట్ చెప్పారు తప్ప అందులో విభజన హామీలకు సంబంధించి ఒక్క విషయంలో కూడా స్పష్టత లేదని రామ్మోహననాయుడు అన్నారు. రెండు దశాబ్దాలుగా రైల్వే జోన్ కోసం పోరాడుతుంటే దాని గురించి కూడా స్పష్టత లేదన్నారు. చెస్తాం చెస్తాం అంటూ ఇంకెత కాలం కాలయాపన చేస్తారన్నారు. జాతీయ స్థాయిలో అన్ని పార్టీలూ ఆంధ్రప్రదేశ్ కు మద్దతు పలుకుతుంటే వీరికి తెలియడం లేదా? మిత్రపక్షంగా ఉన్నా పార్లమెంటో ఆందోళన చేస్తుంటే చెవికెక్కడం లేదా అని ప్రశ్నించారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుస్తుంటే రాష్ట్రంలో విపక్షం మాత్రం మరో విధంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు.