ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూఏఈ కీలక నిర్ణయం..

international |  Suryaa Desk  | Published : Sat, Sep 11, 2021, 02:31 PM

కరోనా కారణంగా పలు దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను యునైటెడ్‌ అరబ్ ఎమిరేట్స్‌ సడలించింది. రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకున్న భారత్ సహా 15 దేశాల పౌరులను సెప్టెంబరు 12 నుంచి తమ దేశంలోకి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ నేషనల్‌ ఎమర్జెన్సీ క్రైసిస్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సరైన నివాస వీసాలు ఉన్నవారు రెండు డోసులు వేసుకుంటే తిరిగి యూఏఈకి రావొచ్చని స్పష్టం చేసింది.


భారత్‌తో పాటు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంక, వియత్నాం, నమీబియా, జాంబియా, డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, ఉగాండా, సియెర్రాలియోన్‌, లైబీరియా, దక్షిణాఫ్రికా, నైజీరియా, అఫ్గానిస్థాన్‌ దేశాల పౌరులకు అనుమతి కల్పిస్తున్నట్లు యూఏఈ ఆ ప్రకటనలో వెల్లడించింది. తమ దేశానికి రావాలనుకునే ప్రయాణికులు రెండు డోసుల వ్యాక్సిన్‌ పూర్తి చేసుకోవడంతో పాటు ఆర్‌టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ పత్రం కూడా చూపించాలని పేర్కొంది.


దుబాయి ఎక్స్‌పో 2020 వరల్డ్‌ ఫెయిర్‌ను అక్టోబరు 1న నిర్వహించనున్న నేపథ్యంలో యూఏఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని గతేడాది నిర్వహించేందుకు దాదాపు దశాబ్ద కాలంగా సన్నద్ధం కాగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. దుబాయిలోని పర్యాటక, ఆర్థిక రంగాల ఉన్నతికి ఈ ఎక్స్‌పో కీలకమవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ సదస్సుకు హాజరయ్యేవారికి తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయడమే కాకుండా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఎక్స్‌పోను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com