ప్రయాణికులకు రైల్వే అధికారులు శుభవార్త చెప్పారు. భారతీయ రైల్వే నడుపుతున్న అన్ని ప్రత్యేక రైళ్లకు తత్కాల్ బుకింగ్ ప్రారంభమైంది. జూన్ 1 నుంచి భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ ఈ రైళ్లలో ప్రయాణించాలనుకునేవారు ఐఆర్సీటీసీ లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్లు తీసుకోవాల్సి ఉండేది. ఈ రైళ్లకు తత్కాల్ బుకింగ్ సౌకర్యం లేదు. అయితే జూన్ 29న తత్కాల్ బుకింగ్ ను ప్రారంభించారు. ఇక ఇప్పటి నుంచి ప్రయాణికులు తత్కాల్ టికెట్ బుకింగ్ చేయొచ్చు. 200 ప్రత్యేక రైళ్లతో పాటు రాజధాని రైళ్లలో కూడా తత్కాల్ బుకింగ్ అందుబాటులో ఉంచారు. మరుసటి రోజు ప్రయాణించాలనుకునేవారు ఇవాళ తత్కాల్లో టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏసీ రైళ్లకు ఉదయం 10 గంటలకు, స్లీపర్ క్లాస్ రైళ్లకు ఉదయం 11 గంటలకు తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రారంభమవుతుందని అధికారులు చెప్పారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్లో తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ను 30 రోజుల నుంచి 120 రోజుల వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. 2020 ఏప్రిల్ 14న లేదా అంతకన్నా ముందు బుక్ చేసిన రైలు టికెట్లను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఫుల్ రీఫండ్ ఇస్తోంది.