ఏపీ ప్రభుత్వం ప్రైవేటు స్కూల్స్కు హెచ్చరించింది. అడ్మిషన్ల కోసం టీచర్లను వేధిస్తే గుర్తింపు రద్దు చేస్తామని ప్రకటించింది. ఏపీలో కరోనా వైరస్ ప్రభావం తగ్గగానే పాఠశాలలను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు కూడా విద్యార్ధులపై దృష్టిసారించాయి. ఏటా చేసినట్లుగానే ఈసారి కూడా తమ టీచర్లను విద్యార్దుల ఇళ్లకు పంపి అడ్మిషన్ల కోసం ప్రయత్నాలు తీవ్రతరం చేశాయి. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయింది. అడ్మిషన్ల కోసం టీచర్లను విద్యార్ధుల ఇళ్లకు పంపడం, వేధించడం చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఆంధ్ర ప్రదేశ్ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ ఆర్. కాంతారావు కమిషన్ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో కమిషన్ వైస్ చైర్ పర్సన్ విజయ శారద రెడ్డి, కార్యదర్శి సాంబశివా రెడ్డి, కమిషన్ సభ్యులు పాల్గొన్నారు.
ఇందులో తీసుకున్న నిర్ణయాలను వారు సిఫార్సుల రూపంలో ప్రభుత్వానికి నివేదించారు. కొన్ని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు తమ సిబ్బంది జీతాన్ని అడ్మిషన్లతో ముడిపెట్టి వేధించడం సరికాదన్నారు. కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న ఈ సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడితే సంబంధిత పాఠశాలలు, కళాశాలల గుర్తింపు రద్దు చేసేలా కమిషన్ చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో ఏ విద్యాసంస్థలోనైనా ఇలాంటివి మళ్లీ జరిగితే apsermc.ap.gov.in పోర్టల్ లో గ్రీవెన్స్ ద్వారా తమకు తెలియజేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఫీజులు చెల్లించలేదనే నెపంతో కొన్ని ప్రైవేటు పాఠశాలలు టీసీలు మంజూరు చేయడం లేదని, విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టరాదని కమిషన్ సూచించింది. ప్రైవేటు పాఠశాలల గుర్తింపు, రెన్యువల్కు సంబంధించిన జిఓ ఎంఎస్ నెంబర్ 1 ను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాల్సి ఉందని, ఇందుకోసం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సీబీఎస్సీ నిబంధనలను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి వారు సూచించారు. మరింత పారదర్శకంగా వేగవంతంగా ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఆన్లైన్ సింగిల్ విండో సిస్టమ్ను తీసుకురావాలని సూచించారు. తద్వారా అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని తెలిపారు
ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని, రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఉపాధ్యాయులు డిప్యుటేషన్, ఫారిన్ సర్వీస్ మీద పనిచేస్తున్నారని, వీరందరిని తిరిగి పాఠశాలకు తీసుకురావాల్సిన అవసరం ఉందని కమిషన్ అభిప్రాయపడింది. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుతం టీవీ మాధ్యమంగా ప్రభుత్వం ప్రసారం చేస్తున్న పాఠాలలో స్పోకెన్ ఇంగ్లీష్ కూడా చేర్చాలని, తద్వారా విద్యార్థులు కొత్త విద్యా సంవత్సరంలో ప్రారంభం కానున్న ఇంగ్లీష్ మీడియంకు అలవాటు పడతారని పేర్కొంది.