ఏపీలో మద్య నిషేధం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. విడతల వారీగా మద్యం దుకాణాలను తగ్గిస్తూ వస్తోంది. మద్యం ధరలను సైతం పెంచింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో మద్యానికి డిమాండ్ ఏర్పడింది. అయితే దీన్ని ఆసరాగా తీసుకున్న కొంతమంది స్వార్థపరులు అక్రమ దందాకు తేరలేపారు. ఓ ఇంటిలో భారీ ఎత్తున మద్యం నిల్వ చేశారు. ఆ ఇంటిపై నెల్లూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దాడులు చేసి రూ.10 లక్షల విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నెల్లూరు పట్టణంలోని కుక్కలగుంటలో మేఘన బార్కి ఎదురుగా ఉన్న ఇంటిని ఉన్నం చిన్నారెడ్డి(51), మావిళ్లపల్లి రవికుమార్(51) అద్దెకు తీసుకున్నారు.
ఆ ఇంటిలో భారీగా మద్యాన్ని అక్రమ నిల్వ చేశారు. అలా నిల్వ చేసిన మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ సమాచారం అందుకున్న నెల్లూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దాడి చేసి పట్టుకుంది. ఈ దాడిలో రూ.10 లక్షల విలువైన 716 మద్యం బాటిళ్లను, ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసును చేధించిన పోలీసులను ఎస్పీ భాస్కర్ భూషణ్ అభినందించారు.