హిందువుల పవిత్రదైవాల్లో ఒకరైన శ్రీకృష్ణుడికి పాకిస్తాన్లో ప్రత్యేకంగా ఓ ఆలయం నిర్మితం కానుంది. ఈ ఆలయానకి రూ. 10 కోట్లను వ్యయం చేయనున్నారు. నిధుల కేటాయింపునకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. మైనారిటీలపై తీవ్ర స్థాయిలో వివక్ష చూపించే పాకిస్థాన్... ఎట్టకేలకు ఓ మంచి పనికి ఉపక్రమించినట్లైందన్న వ్యాఖ్యానాలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి.
ఇస్లామాబాదులో ఈ దేవాలయ నిర్మాణం జరగనుంది. మొత్తం 20 వేల చదరపుటడుగుల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మించనున్నారు.ఈ సందర్భంగా పాక్ మానవహక్కుల పార్లమెంటరీ కార్యదర్శి లాల్చంద్ మాట్లాడుతూ... ఇస్లామాబాదులో హిందువుల జనాభా క్రమంగా పెరుగుతోందని, ఈ నేపధ్యంలో... దేవాలయాలకు వెళ్లాలంటే... హిందువులు ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. ఈ క్రమంలోనే... ఇస్లామాబాద్లో ఆలయాన్ని నిర్మించబోతున్నట్టు తెలిపారు. ఇస్లామాబాద్లోని హిందూ పంచాయతీకి సీడీఏ స్థలాన్ని 2017 లోనే కేటాయించిందనట్లు వెల్లడించారు.
తాజాగా ఆలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం... రూ. 10 కోట్లను విడుదల చేసిందని చెబుతూ... ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా... ఆలయ నిర్మాణానికి భూమి పూజ కూడా జరిగింది.
మరోవైపు, పేదరికంలో మగ్గుతున్న పాకిస్థాన్ను కరోనా వైరస్ మరింతగా దిగజార్చింది. ఈ క్రమంలో... దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. ఇలాంటి సంక్షోభ సమయంలో కూడా హిందూ దేవాలయానికి నిధులు మంజూరు కావడం గమనార్హం.