కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకు పెరుగుతుండడంతో కరోనాకు వ్యాక్సిన్ రెడీ చేసేందుకు దేశ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు,ఔషధ కంపెనీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఫాబీఫ్లూ పేరిట ఓ టాబ్లెట్ విడుదల చేసింది. ఇప్పటికే దానికి ఇండియన్ డ్రగ్ రెగ్యులేటరీ ఏజెన్సీ అనుమతించింది. ఇప్పుడు మరో యాంటి వైరల్ ఇంజక్షన్ తయారీ,మార్కెటింగ్ చేసేందుకు ప్రముఖ ఔషధ సంస్థలైన సిప్లా,హెటిరో కంపెనీలకు డీసీజీఐ అనుమతించింది. యాంటీవైరల్ డ్రగ్ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ తయారీ, మార్కెట్ చేయడానికి తమకు రెగ్యులేటరీ అనుమతి లభించిందని హైదరాబాద్కు చెందిన హెటిరో ల్యాబ్స్ ఆదివారం తెలిపింది. రెమ్డెసివిర్ జనెరిక్ వెర్షన్ ను భారతదేశంలో 'కోవిఫోర్'(Covifor)బ్రాండ్ పేరుతో విక్రయించేలా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతించింది. కరోనా వైరస్ కోసం క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ ప్రకారం ఇది మూత్రపిండాల వ్యాధి, గర్భిణీలు, 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి సిఫారసు చేయలేదు. ఇంజెక్షన్గా ఇచ్చే ఔషధాన్ని రోజుకు 200 మి.గ్రా మోతాదులో ఇవ్వాలి, తరువాత ఐదు రోజులకు 100 మి.గ్రా. సిప్లా మరియు హెటెరో ల్యాబ్స్ ఇప్పటికే యుఎస్ ఫార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఔషధ తయారీకి హెటిరో, సిప్లా పేటెంట్ హోల్డర్ గా ఉన్నాయి. లక్ష డోసుల ఇంజక్షన్లు సిద్దం చేశామని హెటిరో చైర్మన్ బి పార్థ సారథి రెడ్డి తెలిపారు. దీంతో తెలంగాణ నుంచే కరోనాకు మందు తయారైనట్టైంది.