కరోనాతో పోరాడుతున్న ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్కు డాక్టర్లు శుక్రవారం ప్లాస్మా థెరపీ అందించారు. మాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి ఆరోగ్యం క్షిణించడంతో డాక్టర్లు ఈ చికిత్స అందించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సత్యేందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, జ్వరం తగ్గిందని డాక్టర్లు తెలిపారు. మంత్రిని వారు ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. జూన్ 15 సత్యేందర్ జైన్.. తీవ్రమైన జ్వరంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మంత్రి ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. అనంతరం జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో సత్యేందర్కు కరోనా సోకినట్టు వెల్లడైంది. అయితే శుక్రవారం నాడు ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో డాక్టర్లు ఆయన ఊపిరితీసుకునేందుకు వీలుగా కృత్రిమంగా ఆక్సిజన్ను అందించడం ప్రారంభించారు. దీని తరువాత కూడా ఊపిరితిత్తుల్లోని ఓ భాగంలో న్యుమోనియా తరహా లక్షణాలు పూర్తిగా తొలగిపోలేదని సీటీ స్కాన్ పరీక్షలో తేలింది. ఆ తరువాత మంత్రి పరిస్థితి మరింత దిగజారడంతో డాక్టర్లు ఆయనకు ప్లాస్మాతో చికిత్స అందిచారు. దీంతో ఆయన పరిస్థితి మెరుగుపడింది. మరో 24 గంటల పాటు ఐసీయూలోనే ఉంచి మంత్రి పరిస్థితిని నిశితంగా గమనిస్తామని డాక్టర్లు తెలిపారు.