ఏపీలో అసెంబ్లీ, మండలి సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. శాసనమండలి సమావేశాల్లో గందరగోళం చోటుచేసుకుంది. మంత్రి అనిల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. వార్షిక బడ్జెట్పై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు అంశాన్ని టీడీపీ సభ్యుడు నాగ జగదీశ్వర్ రావు సభలో లేవనెత్తారు. బీసీ నాయకులను అణగదొక్కుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ జగదీశ్వర్ ఆరోపించారు.
మధ్యలో కల్పించుకున్న వైసీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్.. అచ్చెన్నాయుడు దొంగతనం చేశాడు కాబట్టే జైలుకు వెళ్లాడని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత సీన్లోకి వచ్చిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ముద్రగడ పద్మనాభం విషయాన్ని ప్రస్తావించారు. కాపు ఉద్యమ సమయంలో మూడువేల మంది పోలీసులతో ఆయన్ను అరెస్ట్ చేయడాన్ని ఎలా భావించాలని అనిల్ ప్రశ్నించారు. దీంతో ప్రతిపక్ష టీడీపీ సభ్యులు తీవ్ర ఆందోళనకు దిగారు. మంత్రి అనిల్ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు మండలిలో మంత్రి అనిల్ లో తొడగొట్టారు.
తనను ఓడించడానికి కోట్లు ఖర్చుపెట్టారని మంత్రి అనిల్ అన్నారు. మరో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రుల భాష, తీరుపై అంతటా చర్చ జరుగుతుందని. భాష మార్చుకుంటే బాగుంటుందని సూచించారు. ఈ క్రమంలో గడ్డంపై వ్యాఖ్యలు చేశారు. గడ్డం పెంచుకున్నవారందరూ రౌడీలా...? అంటూ చైర్మన్ షరీఫ్ గడ్డంపైనా వ్యాఖ్యలు చేశారు. ఆయన రౌడీనా అని ప్రశ్నించారు. చంద్రబాబుకి గడ్డం ఉందంటే ఆయన రౌడీనా అన్నారు. దీంతో ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగాయి. ఇరుపక్షాల వాదనలతో మండలి వేడెక్కింది. దీంతో శాసన మండలి చైర్మన్ సభను వాయిదా వేశారు.