ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లాక్డౌన్ నిబంధనలను సడలించి సాధారణ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే కొన్ని దేశాల్లో వైరస్ పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. అయితే ఆర్థిక వ్యవస్థ బలపడేందుకు లాక్డౌన్ ఎత్తేయక తప్పని పరిస్థితి నెలకొని ఉంది. అందుకే కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఆయా దేశాలు టెక్నాలజీపై ఆధారపడుతున్నాయి. తాజాగా సింగపూర్ కూడా కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు తమ దేశ ప్రజలకు సరికొత్త సాంకేతికతతో కూడిన పరికరాన్ని అందివ్వనుంది. దీని ద్వారా కరోనా సోకిన వ్యక్తులను కలిసిన వారిని సులభంగా గుర్తించవచ్చు. ధరించేందుకు వీలుగా కానీ, హ్యాండ్ బ్యాగ్లో తమతో పాటు తీసుకెళ్లే విధంగా దీనిని రూపొందించనున్నారు. ఈ పరికరాన్ని దేశవ్యాప్తంగా ఉన్న 5.7 మిలియన్ మంది ప్రజలకు అందివ్వనున్నారు.గతంలో స్మార్ట్ఫోన్ ఆధారంగా పనిచేసే సాంకేతికతను అందుబాటులోకి తీసుకువచ్చారు. అందులో భద్రతాపరమైన లోపాలు తలెత్తడంతో, కొత్తగా అభివృద్ధి చేసిన ఈ పరికరాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సింగపూర్ ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే దీనిని ప్రజలందరికీ అందివ్వనున్నట్లు సింగపూర్ మంత్రి వివియన్ బాలక్రిష్ణన్ తెలిపారు. అయితే ఆ పరికరాన్ని ప్రజలు తప్పనిసరిగా తమతో పాటు తీసుకెళ్లాలనే దానిపై మాత్రం ప్రభుత్వం ఎలాంటి స్పష్టతనివ్వలేదు. సింగపూర్లో అభివృద్ధి చేస్తున్న ఈ సాంకేతిక వల్ల ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదం లేకపోలేదని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సింగపూర్ ప్రభుత్వం మాత్రం ఈ పరికరం సేకరించిన డేటా మొత్తం వినియోగదారుల ఫోన్లో సంక్షిప్తం అవుతుందని, ఒక వేళ ఎవరికైనా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయితే వారికి కలిసిన వారికి సంబంధించిన సమాచారం అధికారులకు బదిలీ అవుతుందని చెబుతోంది.