ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుణెలోని ఈ దెయ్యాల కోట కథ వింటే గుండె జారుతుంది!

national |  Suryaa Desk  | Published : Wed, May 13, 2020, 06:07 PM

చారిత్రక ప్రాంతాలు, భవనాలు, కోటలు అలనాటి అద్భుతాలకు ప్రతీకగా నిలుస్తాయి. ఘనమైన చరిత్ర గల మన ఇండియాలో ఇలాంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీటిలో మహారాష్ట్రలోని పుణెలో ఉన్న శనివర్వాడ కోట కూడా ఒకటి. కానీ, ఈ కోటలో అడుగుపెట్టాలంటే గుండె ధైర్యం ఉండాలి. ఎందుకంటే.. పగలంతా ఎంతో అందంగా కనిపించే ఈ కోట సూర్యస్తమయం తర్వాత శ్మశనాన్ని తలపిస్తుంది. పౌర్ణమి వచ్చిందంటే చాలు.. ఆ కోట పరిసరాల్లో నిశబ్ద వాతావరణం నెలకొంటుంది. అక్కడికి వచ్చే పర్యాటకులను కోట పరిసరాల్లోకి వెళ్లవద్దని స్థానికులు హెచ్చరిస్తారు. నిండు వెన్నెల్లో అక్కడ ఏవేవో అరుపులు, ఆకారాలు తమకు కనిపిస్తుంటాయని.. అటుగా వెళ్తే అవి తమను వెంటాడుతుంటాయని స్థానికులు చెబుతుంటారు. అలాగే, సాయంత్రం 5 దాటిన తర్వాత కూడా అక్కడ ఎవరూ ఉండకూడదు. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది కూడా సాయంత్రం వేళల్లో ఆ పరిసరాల్లో ఉండవద్దని హెచ్చరిస్తారు.ఆ కోటలో ఏ జరిగిందో తెలుసుకోవాలంటే.. ముందుగా ఆ కోట చరిత్ర గురించి తెలుసుకోవాలి. ఈ కోటను బాజీరావు పేష్వా నిర్మించారు. అయితే, బ్రిటీషు వారి దాడి వల్ల కోటలో రాతి నిర్మాణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. బాజీరావు మరణం తర్వాత అతని కుమారుడు బాలాజీ బాజీరావు (నానా సాహెబ్) మరాఠా సామ్రాజ్యాన్ని పాలనను చేజిక్కించుకున్నాడు. నానా సాహెబ్‌కు మాధవ్ రావు, విశ్వాస్ రావు, నారాయణ్ రావు అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. నానా సాహెబ్ యుద్ధంలో వీరమరణం తర్వాత మాధవ్ రావు ఆ బాధ్యతలు తీసుకున్నారు. మరో భయానక యుద్ధంలో అతని సోదరుడు విశ్వాస్ రావు కూడా చనిపోయారు. తమ్ముడి మరణాన్ని జీర్ణించుకోలేక మాధవ్ రావు ఆత్మహత్య చేసుకున్నాడు.అది 1773.. తండ్రి, అన్నల మరణం తర్వాత మూడో కుమారుడైన నారాయణ రావు సామ్రాజ్య బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. అయితే, అతడికి 16 ఏళ్లే కావడం వల్ల అతడి పినతండ్రి రఘునాథ్ రావు సలహాలు సూచనలతో సామ్రాజ్యాన్ని నడిపేవాడు. రఘునాథ రావు, అతడి భార్య ఆనంది బాయ్.. కుటిల బుద్ధితో మెల్లగా సామ్రాజ్యం మీద పట్టు సాధించారు. నారాయణ రావును గృహ నిర్బంధం చేశారు. నారాయణ రావు పాలన సమయంలో రఘునాథ రావు కుట్ర వల్ల గార్దీ అనే గిరిజన జాతి ప్రజలతో విభేదాలు తలెత్తాయి. దీంతో రఘునాథ రావు భార్య ఆనంది బాయ్ ఆ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలని భావించింది. ఈ సందర్భంగా గార్దీ జాతి పెద్దకు ఓ లేఖ రాయాలని భర్తకు తెలిపింది. నారాయణ రావుపై కక్ష తీర్చుకొనే సమయం వచ్చిందని, కోటలోకి వస్తే.. అతడిని మీకు పట్టిస్తానంటూ రఘునాథ రావు లేఖ రాసి గిరిజనులకు పంపాడు.రఘునాథ రావు లేఖ మేరకు గిరిజనులు రహస్యంగా కోటలోకి ప్రవేశించారు. నారాయణ రావు గదిలోకి ప్రవేశించి హత్య చేశారు. అనంతరం అతడిని శరీరాన్ని ముక్కలుగా నరికి కోటను దాటించారు. అనంతరం సమీపంలోని నదిలో పడేశారు. అప్పటి నుంచి పౌర్ణమి రోజుల్లో నారాయణ రావు ఆత్మ ప్రతీకారం తీర్చుకోడానికి ఆ కోటలోనే తిరుగుతుందని చెబుతుంటారు. ఆ కోటలో ఎవరున్నా.. వారిని తన శత్రువుగానే భావిస్తూ ఆత్మ ప్రాణాలు తీసేదని స్థానికులు చెబుతున్నారు. అంతేగాక, నారాయణ రావు మరణం తర్వాత కోట సమీపంలో ఏర్పడిన మంటల్లో పలువురు చనిపోయారని పౌర్ణమి రోజుల్లో వారి ఆత్మలు కోట చుట్టూ తిరగుతుంటాయని చెబుతుంటారు. అయితే, అక్కడ నిజంగా ఆత్మలు ఉన్నాయా? అందులోకి వెళ్లిన వ్యక్తులు ఎలా చనిపోయారనేది మాత్రం ఇప్పటికీ అంతు చిక్కలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com