వేల కోట్ల రూపాయల స్టాంపు పేపర్ల కుంభకోణం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. 1990వ దశకం ఆరంభంలో ఇది మొదలైంది. మొదట తెల్గీకి స్టాంపు పేపర్లు అమ్మే లైసెన్స్ ఉండేది. ఆ క్రమంలో అతను నకిలీ స్టాంపు పేపర్లను అచ్చువేయడం మొదలుపెట్టారు. నకిలీ స్టాంపు పేపర్లు అమ్మడం కోసం తెల్గీ వందలాది మందిని ఏజెంట్లుగా నియమించుకున్నారనీ, ఆయన నెలసరి ఆదాయం కొన్ని కోట్లల్లో ఉండేదనీ చెబుతారు. తెల్గీపై ఆరోపణలు 1995లో వచ్చినప్పటికీ 2001లో ఆయనను అరెస్టు చేశారు. 16 ఏళ్లు ఆయన జైలులో ఉన్నారు. అబ్దుల్ కరీం తెల్గీ అరెస్టు తర్వాత పలువురు రాజకీయ నాయకులనూ, పోలీసు ఉన్నతాధికారులనూ కూడా అదుపులోకి తీసుకున్నారు.తెల్గీకి 2006లో కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో పాటు రూ. 202 కోట్ల జరిమానా కూడా విధించింది. పలు ఫోన్లను ట్యాపింగ్ చేయడం ద్వారా కోట్లాది రూపాయల నకిలీ స్టాంపు పేపర్ల కుంభకోణాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం వెలుగులోకి తెచ్చింది. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్రోకరే సంస్థలు సహా వివిధ సంస్థలకు తెల్గీ నకిలీ స్టాంపులు అమ్మేవాడని సిట్ ఆరోపించింది. పరప్పన అగ్రహారం జైల్లో శిక్ష అనుభవిస్తుండగానే అతడు మృతిచెందాడు. తెల్గీ చనిపోయిన సంవత్సరం తర్వాత అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ మహారాష్ట్రలోని నాశిక్ కోర్టు తీర్పునివ్వడం కొసమెరుపు.