దేశవ్యాప్తంగా అందర్నీ కరోనా భయం వెంటాడుతోంది. నెల్లూరు జిల్లాలోనూ ఓ మహిళను కరోనా భయం వెంటాడింది. లాక్డౌన్తో చిక్కుకుపోయి ఇంటికి వచ్చిన భర్తను కరోనా పరీక్షలు చేయించుకున్న తర్వాతే ఇంట్లోకి రావాలని తేల్చి చెప్పింది. వెంకటగిరికి చెందిన మహిళ భర్త నెల్లూరులో బంగారం పనులు చేస్తుంటాడు. లాక్డౌన్ ప్రకటించడంతో అక్కడే చిక్కుకుపోయాడు. అతి కష్టం మీద రెండు రోజుల క్రితం ఇంటికి చేరుకున్నాడు. కానీ భార్య అతడ్ని ఇంట్లోకి రానివ్వలేదు. కరోనా పరీక్షలు చేయించుకుని రావాలని, ఆ తర్వాతే ఇంట్లోకి రానిస్తానని తేల్చి చెప్పింది. అప్పటి వరకు అతడ్ని అంగన్వాడీ కేంద్రంలో ఉంచి వాలంటీర్ల ద్వారా వైద్య ఆరోగ్య సిబ్బందికి సమాచారం అందించింది. అతడ్ని ప్రత్యేక వాహనంలో వైద్య సిబ్బంది నెల్లూరు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అతడికి ఎలాంటి లక్షణాలు, ప్రభావం లేకపోవడంతో తిరిగి వెంకటగిరిలో ఇంట్లో వదిలేశారు. దీంతో భార్యతో పాటూ స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. తన భర్త వేరే ఊరి నుంచి వచ్చాడని, కరోనా ప్రభావం ఉండటంతో తన పిల్లలు, ఊర్లో ప్రజల కోసమే ఇలా చేశానని భార్య చెబుతోంది.