ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీఎం వైఎస్ జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 02, 2020, 09:27 AM

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. కరోన వైరస్ ప్రభావం ఉన్నందున ఎవరి ఇళ్లలో వారే పండుగను జరుపుకోవాలని కోరారు. తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ శ్రీ‌రామ న‌వమి శుభాకాంక్ష‌లు తెలిపారు జగన్. క‌రోనా నేప‌థ్యంలో ఈ పండుగ‌ను ప్ర‌జ‌లంద‌రూ ఇళ్ల‌ల్లోనే ఉంటూ భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకోవాల‌ని, శ్రీ‌రాముడి ఆశీస్సులు రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై ఉండాల‌ని, ప్ర‌జ‌లంద‌రూ సుఖ సంతోషాల‌తో ఉండేలా చూడాల‌ని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు.


ఏ ప్రాంత ప్రజలైనా రామరాజ్యం కావాలని కోరుకుంటారన్నారు చంద్రబాబు. ఎందుకంటే ఒక ఉత్తమ వ్యవస్థకు రూపం ఇచ్చిన ఉత్తమ పాలకుడు శ్రీరాముడు. అధికారాన్ని ప్రజోపయోగంగా ఎలా వినియోగించాలో రాముడు మనకు తెలియచెప్పారన్నారు. అందుకే గాంధీజీ సైతం స్వతంత్ర భారతదేశం రామరాజ్యంలా విలసిల్లాలని కోరుకున్నారని.. విభజన కారణంగా భద్రాద్రిని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ లోటు కనపడనీయకుండా, కడప జిల్లాలో 450 ఏళ్ళ చరిత్ర కలిగిన ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని రూ.100కోట్లతో అభివృద్ది చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రతిఏటా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించే ఏర్పాట్లు చేశామన్నారు.


కానీ గత ఏడాదిగా ఒంటిమిట్ట కోదండ రామాలయ అభివృద్ధి పనులు ఆగిపోవడం బాధాకరమన్నారు చంద్రబాబు. ప్రతి ఏటా వీధివీధినా చలువపందిళ్ళలో వేడుకగా జరిగే సీతారాముల కళ్యాణోత్సవాలు ఈ ఏడాది కరోనా వల్ల ఇళ్లకే పరిమితం అయ్యాయి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, రాజ్యం సుభిక్షంగా ఉండాలనేదే కోదండరాముడి ఆకాంక్ష అన్నారు. కాబట్టి ఈ పండుగవేళ ఇళ్ళకే పరిమితమై శ్రీరాముని దివ్య చరిత్రను మననం చేసుకుందామని పిలుపునిచ్చారు. మన ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యంతోపాటు సమాజ ఆరోగ్యం కాపాడదాం. ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com