ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది.. ఇప్పుడా బిల్లు కేంద్రం ముందుంది.. రేపటి నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో అది ఆమోదం పొందాల్సిఉంటుంది.. అప్పటిదాకా మండలి కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయా? లేదా? అనే ప్రశ్నకు మండలిలో టీడీపీ పక్షనేత యనమల రామకృష్ణుడు స్పష్టమైన సమాధానం చెప్పారు. గురువారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సెలెక్ట్ కమిటీల ఏర్పాటు, మండలి అధికారుల తీరుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తన సొంతానికి అనుకుంటేనో లేదా మందబలంతో శాసనసభలో తీర్మానం చేసి పంపితేనో.. శాసనమండలి అప్పటికప్పుడు రద్దయిపోదని, చట్టవిరుద్ధమైన మండలి రద్దు బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందే ప్రశ్నే ఉత్పన్నంకాదన్న యనమల.. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై సెలెక్ట్ కమిటీలు ఏర్పాటుకావాల్సిందేనన్నారు. ఈ విషయంలో భిన్నవాదనను తెరపైకి తెస్తోన్న అసెంబ్లీ అధికారులపై ఆయన మండిపడ్డారు.
రెండు బిల్లులపై ఇద్దరు మంత్రుల ఆధ్వర్యంలో రెండు సెలెక్ట్ కమిటీలు ఏర్పాటు చేయాల్సిందిగా మండలి చైర్మన్ షరీఫ్.. మండలి సెక్రటరీకి లేఖరాసినట్లుగా వచ్చిన వార్తలను అధికార వర్గాలు తోసిపుచ్చడం ఆశ్యర్యంగా ఉందని యనమల అన్నారు. చైర్మన్ లేఖలు ఇంకా అందలేదని అధికారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అధికారులు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని సూచించారు.
''రెండు సెలెక్ట్ కమిటీలకు పేర్లు కోరుతూ ఆయా పార్టీలకు లేఖలు పంపాలని కౌన్సిల్ చైర్మన్ స్వయంగా కైన్సిల్ సెక్రటరీకి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కానీ ఇప్పుడా అధికారి తనకే లేఖా అందలేదని చెబుతున్నారు. చైర్మన్ ఆదేశాలను తూచాతప్పకుండా పాటించడం మండలి సెక్రటరీ విధి. ఒకవేళ చైర్మన్ ఆదేశాలకు మండలి సెక్రటరీ అడ్డుతగిలితే.. అది సభా ధిక్కరణ పరిధిలోకి వస్తుంది. అప్పుడా అధికారులపై సీరియస్ యాక్షన్ కూడా ఉంటుంది. అందుకే నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని కోరుతున్నాం''అని యనమల రామకృష్ణుడు వివరించారు.