ఉల్లి ధరల పై ఏపీ అసెంబ్లీలో వాడీవేడీ చర్చ జరిగింది. రైతు బజార్లలో ఉల్లిగడ్డ కోసం కిలో మీటర్ల మేర లైన్లు కడుతున్నారని వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అన్నారు. కిలో ఉల్లి రూ.25 రూపాయలకు అమ్ముతున్నామని చెబుతున్నా అది అన్ని ప్రదేశాలలో అమలు కావడం లేదని చంద్రబాబు విమర్శించారు. ఇదే సమయంలో హెరిటేజ్ ఫ్రెష్ లో కిలో ఉల్లిగడ్డ రూ.200లకు అమ్ముతున్నారని సీఎం జగన్ అన్నారు. దీని పై చంద్రబాబు కలుగజేసుకొని హెరిటేజ్ ఫ్రెష్ తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. హెరిటేజ్ తో సంబంధం ఉందని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చంద్రబాబు అన్నారు. నిరూపించలేకపోతే సీఎం పదవికి జగన్ రాజీనామా చేస్తారా అని చంద్రబాబు సవాల్ విసిరారు. దీంతో సభలో ఇరు పార్టీల ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం నెలకొంది. ఆధారాలతో నిరూపిస్తామని ఇరు పార్టీల నేతలు విమర్శలు చేసుకున్నారు.