ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మురళీ విజయ్ కి మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా !

national |  Suryaa Desk  | Published : Tue, Dec 10, 2019, 05:46 PM

రంజీ ట్రోఫీలో భాగంగా మంగళవారం తమిళనాడులోని దిండిగల్ వేదికగా కర్ణాటక, తమిళనాడు జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్‌తో మురళీ విజయ్ దూకుడుగా వ్యవహరించడంతో అతడి మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించినట్లు తమిళనాడు టీమ్‌ మేనేజ్‌మెంట్ తెలిపింది. టీమిండియా వెటరన్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌లో కర్ణాటక బ్యాట్స్‌మెన్ పవన్ వికెట్ల ముందు ఎల్బీగా దొరికిపోయాడు. ఫీల్డర్లతో పాటు అశ్విన్ అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ నితిన్ ఆ అప్పీల్‌ని తిరస్కరించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన మురళీ విజయ్ నోటికి పనిచెప్పాడు. కెప్టెన్ విజయ్ శంకర్‌తో పాటు ఫీల్డర్లు కూడా పిచ్ మధ్యలోకి రాగా, బౌలర్ అశ్విన్‌కి అంపైర్ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అంఫైర్ పట్ల మురళీ విజయ్ పరుష పదజాలం ప్రయోగించాడు. దీంతో బీసీసీఐ క్రమశిక్షణ ఉల్లంఘన కింద మురళీ విజయ్ మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక జట్టు 336 పరుగులకి ఆలౌటైంది. కర్ణాటక జట్టులో దేవదత్ పడిక్కల్(78), పవన్ దేశ్ పాండే(65), గౌతమ్(51) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన తమిళనాడు 55 ఓవర్లకు గాను 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసంది. ప్రస్తుతం దినేశ్ కార్తీక్(21), జగదీషన్(1) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత జట్టులోకి 2008లో అరంగేట్రం చేసిన మురళీ విజయ్ గతేడాది డిసెంబరులో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. మురళీ విజయ్ స్థానంలో చోటు దక్కించుకున్న పృథ్వీషా, మయాంక్ అగర్వాల్‌లు సత్తా చాటడంతో టెస్టు జట్టులో తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నారు. ఇటీవలే దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో జరిగిన టెస్టు సిరిస్‌ల్లో మయాంక్ అగర్వాల్ సెంచరీలతో ఆకట్టుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com