పాకిస్తాన్ క్రికెట్ జట్టు కథ మారలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. సోమవారం ముగిసిన చివరిదైన రెండో టెస్టులో భాగంగా పాక్కు కూల్చేసిన ఆసీస్ మరో ఇన్నింగ్స్ విజయాన్ని నమోదు చేసింది. పాకిస్తాన్ను రెండో ఇన్నింగ్స్లో 239 పరుగులకు కట్టడి చేసిన ఆసీస్.. ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది. తొలి టెస్టులో సైతం ఆసీస్ ఇన్నింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్లో అసాద్ షఫీక్(57), మహ్మద్ రిజ్వాన్(45)లు, షాన్ మసూద్(68)లు మాత్రమే రాణించగా మిగతా వారంతా విఫలమయ్యారు. దాంతో పాక్కు ఇన్నింగ్స్ పరాభవం తప్పలేదు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్ ఐదు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. అతనికి జతగా హజల్వుడ్ మూడు వికెట్లు సాధించగా, మిచెల్ స్టార్క్కు వికెట్ దక్కింది. 39/3 ఓవర్నైట్ స్కోరుతో ఫాలోఆన్ను కొనసాగించిన పాకిస్తాన్ను ఓవర్నైట్ ఆటగాళ్లు మసూద్-షఫీక్లు ఆదుకునే యత్నం చేశారు. కాగా, వీరిద్దరూ ఔటైన తర్వాత పాకిస్తాన్ పతనం కొనసాగింది. రిజ్వాన్ కాసేపు ప్రతిఘటించడం మినహా మిగతావారు ఆసీస్ బౌలింగ్కు దాసోహం అయ్యారు.