దేశ రాజధాని నగరం ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రత కొనసాగుతుండటంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో గాలి కాలుష్యంపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వ తీసుకున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సరి-బేసి విధానం అమలు రోజుల్లో కాలుష్య వివరాలను సీపీసీబీ న్యాయస్థానానికి అందజేసింది. దీనిపై సుప్రీం స్పందిస్తూ సరి-బేసి విధానంతో కాలుష్యంపై ఎలాంటి ప్రభావం లేదని పేర్కొంది. సరి-బేసి విధానం కాలుష్య నియంత్రణకు పరిష్కారం కాదంది. కాలుష్య నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఈ నెల 29న మరోసారి కోర్టుకు హాజరుకావాల్సిందిగా ఢిల్లీ, పంజాబ్, హరియాణా, యూపీ రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సమన్లు జారీచేసింది. అదేవిధంగా ఢిల్లీలో గాలి నాణ్యత పెంపు మార్గదర్శకాలను వారంలోగా రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. మరోవైపు త్రిచక్ర వాహనాల కాలుష్యంపై వారంలో నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పీసీబీకి ఆదేశాలు జారీచేసింది. కాలుష్య కారక వాహనంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.