గతంలో ఈటీవీ ప్రతిధ్వని వ్యాఖ్యతగా వ్యవహరించిన పరకాల ప్రభాకర్ మళ్లీ టీవీ స్కీన్ తెరపైకి రాబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల ఒకటి నుంచి ఆయన మహాన్యూస్ తెరపై కనిపిస్తారు అని ప్రచారం జరుగుతోంది.. ఈ టివి నుంచి నేరుగా బిజెపి లో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలోకి జంప్ అయ్యారు. కొంత కాలం ఆ పార్టీలో పనిచేసినా అర్ధంతంరంగా అక్కడ నుంచి వెళ్లి పోయి టీడీపీతో సన్నిహితమయ్యారు. ఈ క్రమంలోనే గత ఎన్నికలలో విభజిత ఆంద్రప్రదేశ్లో టిడిపి అధికారంలోకి రావటం చంద్రబాబుకి కమ్యూనికేషన్ సలహాదారుడిగా నియామక మవ్వటం జరిగాయి. ఓటుకు నోటు కేసు సమయంలో పరకాల ప్రభాకర్ మాటలు కాంట్రావర్సీగా మారిన నేపథ్యంలో ఎన్నికల ముందు ప్రభుత్వ సలహాదారు పదవీ కాలం ముగిసింది.
కాగా కొద్ది నెలల క్రితం టీడీపీని వీడి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు మాజీ మంత్రి సుజనాచౌదరి తిరిగి మహాటీవీని సొంతం చేసుకున్నారని, దీని నిర్వహణ బాధ్యతలను పరకాలకు అప్పగించారని తెలుస్తోంది. మహాటీవీని కొత్తగా లాంచ్ చేసేందుకు పరకాల టీమ్ ప్రయత్నాలు ప్రారంభించింది. సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్ తో కలిసి మహాటీవీ కోసం న్యూ మ్యూజిక్ కంపోజిషన్స్ చేపట్టారు. ఇప్పటికే పరకాల ఇంట్లో కొత్త టీమ్ కోసం అన్వేషణ జరుగుతోంది. జర్నలిస్టుల కోసం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. కొంతకాలం మహాటీవీ ఆర్ధిక క్రమశిక్షణ లేకపోవడంతో ఇబ్బందులు కొనితెచ్చుకుంది. మరి ఇప్పుడు పరకాల సారథ్యంలో ఏవిధంగా దూసుకెళుతుందో చూడాలి.