ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న టీడీపీ... ఆ ఓటమి నుంచి కోలుకుని అధికార వైసీపీపై రాజకీయ దాడిని ముమ్మరం చేసింది. ఇందుకోసం తన శక్తియుక్తులన్నింటిని ఉపయోగిస్తున్నారు చంద్రబాబు. అయితే ఏపీలో టీడీపీ బలహీనపడటంతో... రాష్ట్రంలో బలపడాలని ప్లాన్ చేస్తోంది బీజేపీ. ఇందుకోసం టీడీపీ నేతలను పెద్ద ఎత్తున బీజేపీలో చేర్చుకునేందుకు ప్లాన్ చేసింది. సుజనా చౌదరి, సీఎం రమేశ్ వంటి టీడీపీ ముఖ్యనేతలు సహా ఇప్పటికే అనేక మంది చంద్రబాబుకు షాక్ ఇచ్చి టీడీపీలో చేరిపోయారు. త్వరలోనే టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే త్వరలోనే బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్న టీడీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు... తనతో పాటు ఎంతమంది టీడీపీ ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకెళతారనే అంశంపై ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీనిపై టీడీపీలోనూ అంతర్గతంగా ఆందోళన నెలకొందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గంటా సారథ్యంలో ఏకంగా ఏపీ అసెంబ్లీలో బీజేపీ శాసనసభపక్షాన్ని తయారుచేసేందుకు పావులు కదుపుతున్నట్టు ఊహాగానాలు మొదలయ్యాయి.
టీడీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేసి... బీజేపీ శాసనసభా పక్షాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీ అధినాయకత్వం వ్యూహరచన చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకుకోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ కొందరు టీడీపీ ఎమ్మెల్యేలను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. టీడీపీలోని ఆ ఎమ్మెల్యేల బృందానికి గంటా శ్రీనివాసరావు సారధ్యం వహిస్తున్నట్టు సమాచారం.