కర్ణాటకలో దారుణం జరిగింది. గొర్రెలు మేపుతున్న యువతి పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి దారుణంగా హత్య చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటకలోని దొడ్డ గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో లింగనహళ్లి గ్రామం ఉంది. గ్రామానికి చెందిన 20 ఏళ్ల అంజలి గొర్రెల కాపరిగా పని చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటుంది. అంజలిని గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమిస్తున్నానంటూ వెంటపడగా అంజలి తిరస్కరించింది. మంగళవారం మధ్యాహ్నాం అంజలి తన పనిలో భాగంగా గొర్రెలను మేపుకుంటూ గ్రామ శివారులోకి వెళ్లింది.
అక్కడ కొంత మంది దుండగులు అంజలి పై దాడికి పాల్పడ్డారు. అంజలి ప్రతిఘటించడంతో వారు ఆమె గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. సాయంత్రమైనా అంజలి ఇంటికి రాకపోయే సరికి తల్లిదండ్రులు వెతకగా అంజలి గ్రామ శివారులో విగత జీవిగా కనిపించింది. అంజలిని అత్యాచారం చేసేందుకు యత్నించి చంపేశారా లేక పాత కక్షలతో ఎవరైనా చంపేశారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
గ్రామస్థులు మాత్రం అంజలిని ప్రేమిస్తున్నానని వెంటపడ్డ యువకుడి పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంజలిని హత్య చేసింది ఎవరనే దాని పై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. దీని పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.