ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ను అద్భుత ఆటతో క్లీన్స్వీప్ చేసిన కోహ్లీసేన మరో సిరీస్కు సన్నద్ధమవుతోంది. బంగ్లాదేశ్తో రెండు టెస్టుల సిరీస్లో భాగంగా గురువారం ఇండోర్లో ప్రారంభమయ్యే తొలి టెస్టుకు భారత్ కసరత్తులు చేస్తోంది. ఆటగాళ్లు మంగళవారం ఎరుపు బంతితో పాటు పింక్ బాల్తో నెట్స్లో ప్రాక్టీస్ చేశారు. కోల్కతాలో ఈనెల 22 నుంచి జరిగే డే/నైట్ టెస్టు కోసం అలవాటు పడేందుకే ఆటగాళ్లు ఎర్ర బంతితో పాటు పింక్ బాల్తో ప్రాక్టీస్ చేశారు. కండరాల గాయంతో బాధపడుతున్న భారత స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కూడా ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. జట్టుతో కలిసి స్కిల్ సెషన్లో పాల్గొన్నాడు. బంగ్లాతో టెస్టు సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో లేకున్నా.. ప్రత్యేక శిక్షణ కోసం ఇండోర్లో జట్టుతో కలిశాడు. ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ సమక్షంలో పూర్తి రనప్తో బౌలింగ్ చేసాడు. అనంతరం శ్రీధర్తో కలిసి క్యాచ్లు కూడా ప్రాక్టీస్ చేసాడు. వెస్టిండీస్ సిరీస్ తర్వాత కండరాల నొప్పితో భువనేశ్వర్ బాధపడుతున్నాడు. అప్పటి నుంచి జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో హెడ్ కోచ్ ద్రవిడ్ పర్యవేక్షణలో అతడు చికిత్స పొందుతున్నాడు. ఫిట్నెస్ పరీక్షించుకోవడానికి ఇండోర్లో జట్టుతో కలిశాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికా, బంగ్లా సిరీస్లకు భువీ అందుబాటులో లేని విషయం తెలిసిందే. మరోవైపు యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా కూడా గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఇద్దరు టాప్ బౌలర్లు లేకున్నా.. టీమిండియా అద్భుతంగా రాణిస్తుండడం విశేషం. బంగ్లాతో టీ20 సిరీస్కు విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇండోర్ స్టేడియంలో పింక్ బాల్తో ప్రాక్టీస్ ప్రారంభించాడు. సన్నాహకాల్లో కొత్త రంగు బంతిని ఎదుర్కోవడంలో అతడు ఎలాంటి ఇబ్బందికి గురికాలేదు. అనంతరం ఛతేశ్వర పుజారా, శుబ్మన్ గిల్ కూడా పింక్ బాల్తో ప్రాక్టీస్ చేశారు. బౌన్స్ వల్ల యువ ఆటగాడు శుభ్మన్ గిల్ కాస్త ఇబ్బంది పడ్డట్లు కనిపించాడు. టీమిండియాలో చాలా మందికి పింక్ బాల్తో ఆడటం ఇదే తొలిసారి. విరాట్ కోహ్లీ సహా చాలా మందికి పింక్ బాల్తో ఆడిన అనుభవం లేదు. పుజారా, మయాంక్, విహారి, కుల్దీప్లకు మాత్రం కూకబుర్రా గులాబీ బంతులతో దులీప్ ట్రోఫీ ఆడిన అనుభవం ఉంది. అందుకే కోల్కతాలో జరిగే డే/నైట్ టెస్టు కోసం అలవాటు పడేందుకు ఆటగాళ్లు శ్రమిస్తున్నారు.