ఏపీ రాజధానిలో స్టార్టప్ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు సింగపూర్ ప్రకటించింది. ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం, సింగపూర్ కన్సార్షియం పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తెలిపారు. కొత్త ప్రభుత్వం అమరావతి స్టార్టప్ ఏరియా అభివృద్ధిపై అంతగా ఆసక్తి చూపడం లేదని ఆయన తెలిపారు. రాజధాని ప్రాంతంలో 1691 ఎకరాల్లో స్టార్టప్ ప్రాజెక్టును చేపట్టాలని గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై 2017లో ఒప్పందం కుదిరింది. అయితే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం వల్ల దేశంలోని ఇతర రాష్ట్రాల్లో సింగపూర్ కంపెనీ పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం ఉండదని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ స్పష్టం చేశారు. ఏపీతో పాటూ మిగిలిన రాష్ట్రాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై సింగపూర్ కంపెనీలు ఇకపైనా ఆసక్తి కనబరుస్తాయన్నారు మంత్రి ఈశ్వరన్. పెట్టుబడులు పెట్టేందుకు భారత్ మంచి అవకాశాలు ఉన్న మార్కెట్గా ఆయన చెప్పారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధి కోసం ఒప్పందం చేసుకుని 17 నెలలు గడిచాయి. అయినా ఇప్పటివరకు ప్రాజెక్టు పనుల్లో ఏ మాత్రం పురోగతి లేదు. దీంతో అమరావతికి లభిస్తుందని ఆశించిన ప్రయోజనం నెరవేరలేదని ఏపీసీఆర్డీఏ కమిషనర్ ఇచ్చిన నివేదికను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.