వెస్టిండీస్ మాజీ ఆల్రౌండర్ డ్వేన్ బ్రేవో సంచలన వ్యాఖ్యలు చేసాడు. తన కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోవడానికి కారణం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మాజీ అధ్యక్షుడు డేవ్ కామెరూన్ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. తనతో పాటు చాలామంది క్రికెట్ కెరీర్ను నాశనం చేశాడు అని బ్రేవో అన్నాడు. డేవ్ కామెరూన్ ఆరేళ్ల పాలన ముగియడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
కామెరూన్ పదవీ కాలం ముగియడంతో ఈ ఏడాది మార్చిలో వెస్టిండీస్ మాజీ జట్టు మేనేజర్ రికీ స్కిరిట్ క్రికెట్ వెస్టిండీస్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. కామెరూన్ ఆరేళ్ల పాటు అధ్యక్షుడిగా కొనసాగాడు. తాజాగా ఓ మీడియా సమావేశంలో బ్రేవో మాట్లాడుతూ కామెరూన్పై ధ్వజమెత్తాడు. 'నా కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోవడానికి కారణం కామెరూన్. నాతో పాటు చాలామంది క్రికెట్ కెరీర్ను నాశనం చేశాడు. చాలామంది క్రికెట్ నుంచి వైదొలగడానికి కారణం కామెరూన్ ప్రతీకార చర్యలే' అని తెలిపాడు.'వెస్టిండీస్ బోర్డు ఇన్ని రోజులు కొంతమంది చేతులో ఉండి నాశం అయింది. కామెరూన్ నియంత పోకడలతో క్రికెట్ బోర్డును నాశనం చేశాడు. దేవుడు ఉన్నాడు, ప్రతి దానికి ముగింపు ఉంటుంది. అతని పదవీ కాలం ముగియడంతో బోర్డుకు మంచి రోజులు వచ్చాయి. కొత్త అధ్యక్షుడు రికీ స్కిరిట్తోనైనా విండీస్ క్రికెట్ దశ మారుతుందనే భావిస్తున్నా' అని బ్రేవో ధీమా వ్యక్తం చేసాడు. బ్రేవో మాటలను బట్టి చూస్తే అతడు రిటైర్మెంట్ వెనక్కి తీసుకునేలా ఉన్నాడు.బ్రేవో 2018లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. 2017లో వెస్టిండీస్ తరఫున బ్రేవో చివరి మ్యాచ్ (టీ20) ఆడాడు. బ్రేవో విండీస్ తరపున 40 టెస్టులు, 164 వన్డేలు, 66 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 2,200 పరగులు, 86 వికెట్లు.. వన్డేల్లో 2,968 పరుగులు 199 వికెట్లు తీశాడు. ఇక టీ20ల్లో 1,142 పరుగులతో పటు 52 వికెట్లను పడగొట్టాడు.
2014లో భారత పర్యటనలో భాగంగా విండీస్ కెప్టెన్గా బ్రేవో వ్యవహరించాడు. అదే సమయంలో ఆటగాళ్ల జీతభత్యాల విషయంలో బోర్డుపై తిరగబడ్డాడు. బోర్డు అలసత్వం ప్రదర్శించడంతో ఉన్నపళంగా పర్యటనను రద్దు చేసుకుని విండీస్కు వెళ్లిపోయాడు. దాంతో ఆ పర్యటనలో ఐదో వన్డే రద్దయ్యింది. ఆ పర్యటనలో ఆడిన నాలుగో వన్డేనే బ్రేవోకు విండీస్ తరఫున చివరి వన్డే.