అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బహిషృత అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు మరో షాక్ తగిలింది. శశికలకు చెందిన 1,600 కోట్ల రూపాయల ఆస్తులను బినామీ ఆస్తుల నిషేధ చట్టం కింద ఐటీ అధికారులు జప్తు చేశారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో పెద్ద నోట్ల సొమ్ముతో శశికళ కుటుంబ సభ్యులు చెన్నై, పుదుచ్చేరి, కోయంబత్తూరులో తొమ్మిది రకాల ఆస్తులను కూడబెట్టారన్న సమాచారంతో ఐటీ శాఖ దాడులు చేసినట్లు తెలిసింది. జప్తు చేసిన ఆస్తుల్లో పెరంబూర్లోని ఓ మాల్, ఓ రిసార్ట్, కోయంబత్తూర్లో ఉన్న ఓ పేపర్ మిల్, చెన్నైలో గంగ ఫౌండేషన్ పేరుతో ఉన్న స్పెక్ట్రమ్ మాల్, పుదుచ్చేరిలో శ్రీలక్ష్మి జువెలరీ పేరుతో ఉన్న ఓ రిసార్ట్ ఉన్నట్లు తెలిసింది. శశికళ శిక్ష అనుభవిస్తున్న బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు అధికారులకు కూడా ఈ జప్తుకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు పంపారు.
2017 నుంచి అక్రమాస్తుల కేసులో శశికళ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ‘ఆపరేషన్ క్లీన్ మనీ’లో భాగంగా చెన్నై, కోయంబత్తూర్, పుదుచ్చేరితో పాటు 37 ప్రాంతాల్లో శశికళ ఆస్తులపై రెండేళ్ల క్రితం ఆదాయపు పన్ను అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. శశికళ ఇంట్లో పని చేసే సిబ్బంది పేర్లపై, కారు డ్రైవర్లు, అసిస్టెంట్ల పేర్లపై బినామీ ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు తేల్చారు.
జయలలిత బతికి ఉన్నప్పుడు చిన్నమ్మగా శశికళ చక్రం తిప్పారు. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే మీద పట్టుకోసం ఆమె చేసిన ప్రయత్నాలు కొంతమేర ఫలించినా.. ఆ తర్వాత పన్నీరు సెల్వం, పళనిస్వామి హ్యాండ్ ఇవ్వడంతో శశికళ, ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్ సొంత పార్టీ పెట్టుకున్న విషయం తెలిసిందే.