ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తీవ్ర దుర్వాసన వెదజల్లుతున్న కెమికల్ ఫ్యాక్టరీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2019, 02:18 PM

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లి ఐడీఏ ఆటోనగర్ కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న దుర్వాసన ప్రాణాంతకంగా మారుతోంది. కెమికల్ కంపెనీలకు సరిహద్దు గ్రామం అయిన జి.కొండూరు మండలంలోని కట్టుబడిపాలెం గ్రామంలో ప్రజలు దుర్వాసన తట్టుకోలేక పెట్రోల్ పోసి ఊరు మొత్తం తగలబెట్టండి అని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి వెలువడుతున్న తీవ్రమైన దుర్వాసన భరించలేక కొండపల్లిలోని కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యాల ఎదుట గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. నేడు శుక్రవారం ఉదయం కూడా తీవ్రమైన దుర్వాసన వెలువడుతూనే వుంది. ఈ సందర్భంగా గ్రామస్తులు చెన్నూరు సుబ్బారావుతో పాటు తదితరులు మాట్లాడుతూ మమ్మల్ని చంపేసి దర్జాగా కెమికల్ ఫ్యాక్టరీలను నడుపుకోండి.. అంటూ వాపోయారు. దుర్వాసన కారణంగా అన్నం తినే సమయంలో నోట్లోకి ముద్ద కూడా దిగడం లేదన్నారు. రోజంతా కష్టపడి పనులకు వెళ్లి తిరిగి తిరిగి ఇంటికి వచ్చిన తమకు కెమికల్ ఫ్యాక్టరీల దుర్వాసన కారణంగా కంటిమీద కునుకు ఉండటం లేదని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గతంలో తొమ్మండ్రు వాగు ద్వారా కాలుష్యపు నీటిని విడుదల చేసేవారు…తాజాగా అదే నీటిని బాయిల్ చేసి వాయుకాలుష్యం రూపంలో విసర్జన చేస్తున్నారన్నారు.


ఏళ్ల తరబడి నుంచి ఈ విషయాన్ని ఎన్నోసార్లు నెత్తీనోరూ బాదుకుని కాలుష్యం గురించి చెప్పుకుంటున్న ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదని అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. విష రసాయనాల వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నామని పేర్కొన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేసి మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. కాలుష్యం వ్యవహారంలో ముడుపులు కూడా చేతులు మారుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. కంపెనీ నడుపుతున్న యాజమాన్యం, అధికారులు, ప్రజా ప్రతినిధులు తమ గ్రామంలో నివాసం ఉంటే స్వయంగా వారికి ఆ పరిస్థితి తెలుస్తుందని పేర్కొన్నారు.


కాలుష్యం ఇకపై వెలువడదని కెమికల్ కంపెనీలు ఎన్నోసార్లు ఇచ్చిన హామీలు నీటి మీద రాతలయ్యాయి. కాలుష్య సమస్య కారణంగా విసిగి వేసారి పోయామని….ఇక మూకుమ్మడిగా చచ్చిపోవడం తప్ప వేరే మార్గం లేదని ఆవేదనతో పేర్కొన్నారు. కంపెనీలు పరిశ్రమలు అభివృద్ధి అనే పేరుతో తమ గ్రామాన్ని విషతుల్యం చేశారని ప్రజలు పేర్కొంటున్నారు. ఈ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు పార్టీలకతీతంగా గ్రామస్తులంతా మూకుమ్మడిగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు ఈ సమస్యపై స్పందించి తక్షణమే తగు ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com