రాజస్థాన్లోని డాంగరీ ఆరోగ్యకేంద్రంలో పనిచేస్తున్న ఏఎన్ఎం సంతోష్ చౌదరి... ఫతేగఢ్ పీహెచ్సీకి చెందిన జీఎన్ఎం ఆయిదాన్రామ్ చౌదరి వీడ్కోలు సమావేశంలో నృత్యంలో మునిగిపోయారు. దీంతో ఒక గర్భిణి ఆసుపత్రిలో ఐదుగంటలపాటు ప్రసవవేదన పడుతూ ఏఎన్ఎం కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే డాంగరీకి చెందిన గర్భిణి రాణీ ఖాన్కు పురుటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి మధ్యాహ్నం 3 గంటల సమయంలో తీసుకువచ్చారు. అయితే ఆసుపత్రికి తాళం వేసివుండటంతో వారు ఏఎన్ఎంకు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో ఆమె వస్తున్నానని చెప్పారు. దీంతో వారు ఆమె రాక కోసం 5 గంటల పాటు ఎదురు చూశారు. తిరిగి రాత్రి 8 గంటల సమయంలో తిరిగి ఎఎన్ఎంకు ఫోన్ చేశారు. అయితే ప్రస్తుతం పార్టీలో ఉన్నామని ఇప్పడు రావడం కుదరదని ఏఎన్ఎం చెప్పారు. దీంతో ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు సర్పంచ్ రాజానారామ్, స్థానిక పార్టీ నేతకు తెలియజేశారు. ఈ విషయం గ్రామస్తులందరికీ తెలియడంతో వారంతా మరోసారి ఏఎన్ఎంకు ఫోన్చేసి బాధితురాలి పరిస్థితిని వివరించారు. ఇంతచెప్పినా ఆసుపత్రికి వచ్చేందుకు ఏఎన్ఎం నిరాకరించారు. చేసేదిలేక గ్రామస్తులంతా బాధితురాలిని మరో ఆసుపత్రికి తరలించారు.